
ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలి
బాపట్లటౌన్: విద్యార్థి దశనుంచే ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. పట్టణంలోని సాయిరాం గార్డెన్స్ కన్వెక్షన్ హాల్లో సోమవారం షైనింగ్ స్టార్ 2025 అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యలో అత్యధిక మార్కులు సాధించిన జిల్లా, మండల స్థాయిలోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించారు. పదో తరగతిలో 164 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్లో 36 మంది విద్యార్థులను అధికారులు సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమూల్యమైన విద్యార్థి జీవితం చెడు వ్యసనాలతో పెడదోవపట్టరాదన్నారు. భావి జీవితంలో ఉన్నత స్థానాలను అలంకరించే స్థాయికి ఎదగాలన్నారు. నేటి సమాజానికి దిక్సూచిలా మారాలని, ఆత్మాభిమానంతో ముందుకు వెళ్లాలన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని విద్యార్థులు గుర్తించాలి, క్రమశిక్షణతో కష్టపడి చదివితే మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవచ్చన్నారు. మాదకద్రవ్యాలు, గంజాయి వంటి చెడు వ్యసనాలతో ప్రలోభాలకు దరికావద్దన్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ ఇష్టంతో కష్టపడి చదవండి, మీకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందన్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ ప్రతిభావంతులను వెలికి తీసి, సమాజం కోసం ప్రయోజకులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి గ్లోరియా, డీఈవో పురుషోత్తమ్, ఆర్ఐఓ ఆంజనేయులు, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి