
పొలిమేరను పరిశీలించిన ఆర్డీఓ
జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు, ఇంకొల్లు మండలంలోని కొణికి గ్రామాల సరిహద్దులోని పొలిమేరను చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మంగళవారం పరిశీలించారు. కొణికి గ్రామానికి చెందిన రైతులు వారి సరిహద్దులో చందలూరు వైపు నుంచి పారుతున్న వర్షపు నీరు అడ్డుకునేందుకు మట్టితో కట్టలు వేశారు. దీనివల్ల చందలూరు గ్రామంలోనే వర్షపు నీరు నిల్వ ఉంటూ పంట పొలాలు దెబ్బతింటున్నాయి. దీంతో చందలూరు రైతులు అధికారులను ఆశ్రయించారు. ఈ విషయమై గతంలో తహసీల్దార్ ఇతర అధికారులు పరిశీలించారు. కొణికి గ్రామ రైతులకు నోటీసులు కూడా పంపారు. ఈ విషయమై మళ్లీ పరిశీలించేందుకు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు వెళ్లారు. సమస్య పరిష్కారానికి ఇరిగేషన్ అధికారులు మార్గం చూపాలని వర్షపు నీటి పారుదల కోసం తూములు ఏర్పాటు చేసి ఇరువర్గాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంగులూరు మండల తహసీల్దార్ పి. సింగారావు, మండల సర్వేయర్ సురేష్, వీఆర్వోలు, ఇరు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.