రమణీయం వేణుగోపాలుని రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

రమణీయం వేణుగోపాలుని రథోత్సవం

Jun 12 2025 3:17 AM | Updated on Jun 12 2025 3:17 AM

రమణీయం వేణుగోపాలుని రథోత్సవం

రమణీయం వేణుగోపాలుని రథోత్సవం

యద్దనపూడి: మండలంలోని పూనూరు గ్రామంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం బుధవారం నేత్రశోభితంగా జరిగింది. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం అనంతరం రథోత్సవం నిర్వహించటం ఆనవాయితీ. గత సంవత్సరం రూ.1.80 లక్షలతో నూతన రథనిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది రథాన్ని భద్రపరిచేందుకు రథశాల నిర్మాణం చేపట్టి బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు దీవి భావనాచార్యులు వేదపండితుల ఆధ్వర్యంలో స్వామికి విశేష పూజలు చేశారు. ఉదయం గరుడవాహనంపై స్వామి వారికి గ్రామోత్సవం జరిగింది. 11 గంటలకు ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు ఏరువాక ఉత్సవాల్లో భాగంగా రైతులు తమ ఎద్దులను, ట్రాక్టర్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీలో రథం వద్దకు తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా రథం వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో రథాంగ హోమం, రథాంగబలి, దృష్టికుంభం, మంచి రాచగుమ్మడికాయలతో రథానికి దిష్టితీసి కొబ్బరికాయలతో సాత్వికబలి సమర్పించారు. అనంతరం స్వామి వార్లను రథంపై అధిష్టింపచేశారు. స్వామి వారిని చూసేందుకు భక్తులు రహదారులకు ఇరువైపులా బారులుతీరారు. ఈ రథయాత్ర ఆలయం నుంచి 2 కిలోమీటర్ల మేర సాగి, తిరిగి ఆలయానికి చేరుకోవటంతో ఘట్టం ముగిసింది. భక్తులు రథాన్ని లాగుతూ గోవింద నామస్మరణ చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అడుగడుగునా స్వామి వారికి మంగళహారతులతో నీరాజనాలు సమర్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై రత్నకుమారి తమ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీఎల్‌ కుమార్‌ భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement