
డాక్టర్ వెలగా సేవలు చిరస్మరణీయం
కాంస్య విగ్రహావిష్కరణలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి: గ్రంథాలయ రంగ ఉన్నతికి, డాక్టర్ వెలగా వెంకటప్పయ్య చేసిన కృషి నేటితరానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలికి చెందిన సాహితీ ప్రముఖుడు, గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి రోజైన గురువారం తెనాలి బండ్పై ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. డాక్టర్ వెలగాతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెనాలి మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాల్లో సావనీరు రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ వెలగాను ‘నడిచే గ్రంథాలయ విజ్ఞాన సర్వస్వం’గా అభివర్ణించారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ డాక్టర్ వెలగా కాంస్య విగ్రహం ఏర్పాటు, భావితరాలకు స్ఫూర్తి కాగలదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక డాక్టర్ వెలగా సేవలను కొనియాడారు. కాంస్య విగ్రహాన్ని రూపొందించిన కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా సత్కరించారు. డాక్టర్ వెలగా కుమారులు సర్వోత్తమరావు, నాగార్జున, వెంకట్రావు, మానవేంద్ర, సోదరుడు వెలగా వీరయ్యతోపాటు గ్రంథాలయ రంగ ప్రముఖుడు లంకా సూర్యనారాయణ, ఈదర పూర్ణచంద్, మాదిరాజు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
●అనంతరం హోటల్ గౌతమ్ గ్రాండ్లో డాక్టర్ వెలగా విగ్రహావిష్కరణ సభను నిర్వహించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, ప్రముఖ రచయిత, పరిశోధకుడు ముత్తేవి రవీంద్రనాధ్, డాక్టర్ నన్నపనేని ప్రతాప్, పార్వతీపురంకు చెందిన పారినాయుడు, ప్రొఫెసర్లు లక్ష్మి, అయినాల మల్లేశ్వరరావు, షేక్ అబ్దుల్ హకీంజాని పాల్గొన్నారు. పావులూరి శ్రీనివాసరావు రచన ‘ఆరు దశాబ్దాల అలుపెరగని డాక్టర్ వెలగా కృషి’ అనే పుస్తకం, విశ్రాంత ప్రొఫెసర్ జి.రామేశ్వర్ రచన ‘ప్రకృతి వైద్యం గ్రంథ సూచి’ ప్రతిని ఆవిష్కరించారు.