
లారీని ఢీకొట్టిన బస్సు..నలుగురికి గాయాలు
అద్దంకి: ముందు వెళ్తున్న లారీని బస్సు ఢీకొని బస్సులోని నలుగురికి గాయాలైన సంఘటన మండలంలోని చిన్నకొత్తపల్లి డొంక వద్ద అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత జరిగింది. అందిన సమాచారం మేరకు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు కందుకూరు నుంచి హైదరాబాద్ బయలుదేరింది. ఆ బస్సు మండలంలోని చిన్నకొత్తపల్లి డొంక వద్దకు రాగానే, అదే మార్గంలో చిన్నకొత్తపల్లి మిల్లు వద్దకు వెళ్లే క్రమంలో మలుపు తిరుగుతున్న లారీని వెనుకగా ఢీ కొట్టింది. దాంతో బస్సులో కుదుపు రావడంతో అందులో ప్రయాణిస్తున్న షేక్ యాకోబ్బాషాతోపాటు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, 108 సిబ్బంది అక్కిడికి చేరుకున్నారు. సంఘటన వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. క్షతగాత్రుడు షేక్ యాకోబ్ బాషాను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు. ఈ ఘటనలో బస్సు మందు భాగం నుజ్జు నుజ్జయింది.
తరచూ ప్రమాదం..డెడ్ స్పాట్
ఈ స్థలంలో గ్రామానికి వెళ్లే రోడ్ క్రాసింగ్ ఉండటంతో పలుమార్లు కార్లు బోల్తా కొట్టడం, ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలసి పోయిన సంఘటనలు కోకోల్లలు. ఇక్కడ ప్రమాద నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.