
తిమ్మాపురం స్పిన్నింగ్ మిల్లులో హత్య
యడ్లపాడు: ఈ నెల 10వ తేదీన వలస కార్మికుడిపై హత్యాప్రయత్నం జరగడంతో తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని శ్రీ మంజునాథ నూలు మిల్లులో ఒడిశా రాష్ట్రానికి చెందిన జగన్నాథ్ కుల్దీప్ పనిచేస్తున్నాడు. తన భార్య రుని కుల్దీప్, ముగ్గురు పిల్లలతో కలిసి మిల్లు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. నెల రోజుల క్రితం జగన్నాథ్ భార్య, పిల్లలు స్వగ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో, జగన్నాథ్ భార్య గురించి అదే మిల్లులో పనిచేస్తున్న మంగూలు లేంక అనే వ్యక్తి ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో మంగూలు తన గదిలోంచి కత్తి తీసుకొచ్చి జగన్నాథ్ను పొత్తికడుపులో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన జగన్నాథ్ను 108 అంబులెన్స్లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేశారు. చికిత్స పొందుతున్న జగన్నాథ్ (38) శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య పోలీస్ స్టేషననుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ శివరామకృష్ణ కేసు నమోదు చేయగా, సీఐ సుబ్బానాయుడు దర్యాప్తు చేస్తున్నారు.
వలస కార్మికుల్లో భయాందోళనలు
ఉపాధి కోసం రాష్ట్రాన్నే వదిలి వచ్చిన వ్యక్తిపై మూడు రోజుల కిందట హత్యాప్రయత్నం జరిగినా, బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. పోలీసులకు కూడా నూలుమిల్లు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటన తాలూకు విషయాలను గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పోలీసులకు తెలిస్తే ఎందుకు బహిర్గతం చేయలేదని పేర్కొంటున్నారు. కార్మికశాఖ అధికారులు కూడా ఇలాంటి ఘటనల సమయంలో కన్నెత్తి చూడక పోవడం, కుటుంబాలతో రాష్ట్రాలు విడిచి వచ్చిన తమ జీవితాలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని వలస కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నూలుమిల్లు పనులు చేసుకుంటున్న వలస కార్మికులు ఈ ఘటనతో తమ కుటుంబాలతో తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఆలస్యంగా వెలుగులోకి దారుణం
గోప్యతపై వలస కార్మికుల అనుమానాలు

తిమ్మాపురం స్పిన్నింగ్ మిల్లులో హత్య