
రాష్ట్ర హోంమంత్రి వ్యాఖ్యలు చట్ట విరుద్ధం
● దళిత, ముస్లిం యువకులపై లాఠీలతో కొట్టిన సీఐలను అరెస్టు చేయాలి ● దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్
చీరాల రూరల్: తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై తెనాలి 2, 3 పట్టణ సీఐలు జరిపిన తాలిబన్ దాడిని ఖండిస్తున్నామని, అందుకు బాధ్యులైన ఇద్దరు సీఐలను అరెస్టు చేయాలని, పోలీసులు కొడితే తప్పేముందన్న రాష్ట్ర హోంమంత్రి అనితను పదవి నుంచి తొలగించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన దళిత మహాసభ రాష్ట్ర నాయకుడు మాచవరపు జూలియన్తో కలసి దళిత మహాసభ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రౌడీషీటర్ల పేరుతో దళిత, ముస్లిం యువకులను నడిరోడ్డుపై బహిరంగంగా అందరూ చూస్తుండగా లాఠీలతో ఇష్టానుసారంగా కొట్టి హింసించడం దారుణమన్నారు. యువకులను కొట్టే హక్కు పోలీసులకు లేదన్నారు. పోలీసులకు కేసులు నమోదుచేసి కోర్టులకు పంపే అధికారం మాత్రమే ఉందన్నారు. ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి చెందిన వీరయ్య చౌదరి అనే మాజీ రౌడీషీటర్ హత్యకు గురైతే హుటాహుటిన హోంమంత్రి అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు కూడా హాజరయ్యారన్నారు. తెనాలిలో దళిత యువకులను రౌడీషీటర్లు అంటున్న హోంమంత్రి అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలసి మాజీ రౌడీషీటర్ వీరయ్య చౌదరి అంత్యక్రియలకు ఏవిధంగా హాజరయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేరాలకు కులం, మతం ఉండదన్న హోంమంత్రి అమరావతి మహిళల అవమానం కేసులో జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులను అరెస్టు చేయించటానికి ఎస్సీ, ఎస్టీ కేసు ఎందుకు పెట్టించారని ప్రశ్నించారు. న్యాయమూర్తి జిల్లా ఎస్పీని, డీఎస్పీని మందలించి ఎస్సీ, ఎస్టీ కేసును తొలిగించింది నిజమా కాదా హోంమంత్రి చెప్పాలన్నారు. కరోనా సమయంలో చీరాలలో దళిత యువకుడు కిరణ్కుమార్ను మాస్కు పెట్టుకోలేదనే నెపంతో అప్పటి టూటౌన్ ఎస్సై కొట్టగా కిరణ్కుమార్ చనిపోయాడని, అందుకు ఎస్సైను బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద ఎస్సైను అరెస్టుచేసి రిమాండ్కు తరలించింది నిజంకాదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఎస్సై కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడో లేదో హోంమంత్రి సమాధానం చెప్పాలన్నారు. రేణంగివరం పోలీసు స్టేషన్లో జె.పంగులూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన మాదిగ యువకులని పోలీసుస్టేషన్లోనే కొట్టి హింసించిన కేసులో ఒంగోలు ఎస్సీ, ఎస్టీ కోర్టు ఎస్సై జగన్మోహనరావుకు రెండు సంవత్సరాలు శిక్ష విధించిందన్నారు. పోలీసులు కొట్టే హక్కు ఉంటే కోర్టులు ఎందుకు శిక్షలు విధించాయో హోం మంత్రి సమాధానం చెప్పాలన్నారు. పోలీసులు కొట్టడం కరెక్టు అయితే పై రెండు కేసులలో నిందితులైన ఇద్దరు ఎస్సైలపై కోర్టులు విధించిన శిక్షలను హోంమంత్రి తన అధికారంతో రద్దు చేయించగలరా అని ప్రశ్నించారు. తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై దాడికి పాల్పడిన సీఐలపై అట్రాసిటీ కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని, పోలీసులు కొడితే తప్పేముందన్న హోంమంత్రి అనితను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం విజయవాడ ప్రెస్క్లబ్లో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, కార్యదర్శి కాకుమాను రవి, దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు షేక్ జిలాని పాల్గొన్నారు.