
అంతర్ జిల్లా దొంగను పట్టుకున్న పోలీసులు
జె.పంగులూరు: అంతర్ జిల్లా దొంగ పబ్బరాజు వెంకట యుగంధర్ను పట్టుకున్నట్లు శుక్రవారం ఎస్సై వినోద్బాబు తెలిపారు. బూదవాడ గ్రామానికి చెందిన వజ్రాల కృష్ణారెడ్డిని వెంకటయుగంధర్ గత నెలలో ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. మంచి వ్యక్తి అని నమ్మి బూదవాడ గ్రామానికి చెందిన హనుమారెడ్డి ఇల్లును అద్దెకు ఇప్పించాడు. ఎంతో నమ్మకంగా ఉంటూ గత నెల 18న రాత్రి 7 గంటల సమయంలో నిందితుడు అన్నవరం ప్రసాదం అని మత్తు మందు కలిపి హనుమారెడ్డి, అతని భార్యకు ఇచ్చాడు. కొద్ది సేపటికే సృహ కోల్పోగా హనుమారెడ్డి భార్య మెడలోని బంగారు గొలుసును దొంగిలించి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాధితులు రేణింగవరం పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఎస్సై వినోద్బాబు తన సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని మంగళగిరి బస్టాండ్ వద్ద పట్టుకున్నట్లు, అతని వద్ద బంగారు రికవరీ చేసినట్లు ఎస్సై వినోద్బాబు తెలిపారు. నిందితుడు గుంటూరు జిల్లా తాడేపల్లి లోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిపారు.