
ఉపాధి హామీ పనులు పెంచండి
జె.పంగులూరు: ఉపాధి హామీ పనులు నియోజకవర్గంలో విస్తృతంగా చేపట్టాలని, కూలీలందరికీ ఉపాధి చూపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని ముప్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. నియోజక వర్గంలో ప్రతి గ్రామానికి రూ. 30 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. ముప్పవరం గ్రామంలోని బీసీ కాలనీలో ఉపాధి హామీ నిధుల ద్వారా రూ. 20 లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు, సైడు డ్రైన్ నిర్మించామన్నారు. జిల్లా పరిషత్ నిధులు రూ. 15 లక్షలతో మరో రోడ్డు కూడా నిర్మించినట్లు తెలిపారు. ముప్పవరం ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు రూ. 3 కోట్లతో బైపాస్ నిర్మించేందుకు అనుమతి లభించిందని తెలిపారు. మరో రెండు నెలల్లో ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ముప్పవరం గ్రామంలో 16 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందించామని తెలిపారు. పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థికం సాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.సింగారావు, విద్యుత్ ఏఈ గోరంట్ల అనిల్ కుమార్, ఏపీఓ సంతోషం, పంచాయతీ కార్యదర్శి జానీబేగం తదితరులు పాల్గొన్నారు.
ముప్పవరం సభలో మంత్రి గొట్టిపాటి