
కూటమి పాలనలో కక్ష సాధింపు మినహా సంక్షేమం శూన్యం
అరచేతిలో ప్రజలకు వైకుంఠం చూపిన కూటమి నేతలు అధికారం చేజిక్కించుకుని ఏడాదైంది. అన్ని వర్గాల ప్రజలను సీఎం నారా చంద్రబాబు నరకయాతనే పెడుతున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, వ్యాపారులు.. ఇలా అన్నివర్గాలను నట్టేట ముంచారు. నిలువునా మోసం చేసి బూటకపు మాటలతో పూటపూటకు మాయ చేస్తూ పబ్బం గడుపుతున్నారు. ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకం అమలుకాలేదు. అభివృద్ధి ఆనవాలు అసలే కనిపించడం లేదు. రెడ్ బుక్ పేరిట అరాచక పాలన మాత్రమే పాలకులకు చేతనైంది. అడ్డగోలుగా కూటమి నేతలు రూ.కోట్లకు పడగలెత్తేలా పరిపాలన సాగుతోంది.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి వంచన పాలనకు ఏడాది పూర్తయింది. ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ పేరిట ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ చంద్రబాబు సర్కారు నెరవేర్చలేదు. నమ్మించి మోసగించిన సర్కార్పై పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లేయించుకొని గద్దెనెక్కాక వంచిచడంపై మండి పడుతున్నారు. ఇచ్చిన మాట సంగతి దేవుడెరుగు చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు పతాక స్థాయికి చేరాయి. ఇసుక, బుసక, గ్రానైట్, గ్రావెల్ను ట్రిప్పుల లెక్కన విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. పేదల కడుపుకొట్టి చౌక బియ్యాన్ని ఒక్కో ప్రజాప్రతినిధి నెలకు రూ. 25 లక్షలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెడ్బుక్ పాలనను తెరపైకి తెచ్చి హత్యలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాన్య ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఏ ఒక్కవర్గం సంతృప్తిగా లేదు. మొత్తంగా కూటమి ఏడాది పాలన ప్రజాకంఠకంగా మారడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డగోలుగా ‘పచ్చ’ దోపిడీ
పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు, అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ ప్రాంతాల నుంచి రోజూ రూ.కోట్ల విలువైన గ్రానైట్ పలకలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిపోతున్నాయి. పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల నుంచి నిత్యం గ్రావెల్ అక్రమ రవాణా సాగుతోంది, చినగంజాం, కడవకుదురు ప్రాంతాల నుంచి జిల్లాతోపాటు తెలంగాణకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ప్రభుత్వ, అసైన్డ్, అటవీ శాఖ భూముల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని కూడా వదలడం లేదు. టోల్గేట్లు పెట్టి పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అసైన్డ్ భూములను ఆక్రమించి లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారు.
పేదల బియ్యాన్నీ వదల్లేదు...
జిల్లాలో రేషన్ మాఫియా విజృంభిస్తోంది. ఒక్కొక్క పచ్చ ప్రజాప్రతినిధి పేదలకడుపు గొట్టి చౌక బియ్యాన్ని నెలకు రూ. 25 లక్షలకు విక్రయిస్తున్నారు. రేషన్ డీలర్లకు చేరకుండానే బియ్యం ప్రభుత్వ గోదాముల నుంచి నేరుగా మాఫియాకు చేరుతోంది. బియ్యం కావాలని అడిగితే రేషన్ కార్డులు రద్దు చేయిస్తామని పచ్చ నేతలు బెదిరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
అడ్డగోలుగా వసూలు
బాపట్ల నియోజకవర్గంలో తీరప్రాంతాన్ని అడ్డు పెట్టి పచ్చ నేతలు తాజాగా టోల్గేట్లు ఏర్పాటు చేశారు. పర్యాటకుల నుంచి వసూళ్లకు దిగారు. వెదుళ్లపల్లి ప్రాంతం నుంచి నిత్యం ఇసుక తరలించి అమ్ముకుంటున్నారు. చీరాల, బాపట్ల నియోజకవర్గాల్లో అక్రమ రిసార్టులు కుప్పలుతెప్పలుగా వెలుస్తున్నాయి. పర్యాటక శాఖ అనుమతులతో పనిలేకుండా పచ్చనేతలు మామూళ్లు పుచ్చుకొని అనధికార అనుమతులు ఇస్తున్నారు. అక్రమ లేఅవుట్ల వ్యాపారం ఇక్కడి పచ్చనేతలకు ఆదాయ వనరుగా మారింది. పిట్టలవానిపాలెం, కర్లపాలెం ప్రాంతాల్లో పేకాట, కోడిపందేలు జోరుగా నడుస్తున్నాయి.
వేమూరు నియోజకవర్గంలో కృష్ణానది నుంచి నిత్యం అక్రమంగా ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. పేకాట, కోడిపందేలు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. ఇక్కడ మట్టి వ్యాపారం పచ్చ నేతలకు కాసులు కురిపిస్తోంది. రేపల్లె నియోజకవర్గంలో పేకాట, కోడిపందేలు జోరుగా నడుస్తున్నాయి.
సూపర్సిక్స్ పేరుతో వంచన
అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామన్నారు. రెండో ఖరీఫ్ సీజన్ వచ్చినా జిల్లాలోని 1,92,037 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ. 384,06 కోట్లలో పైసా ఇవ్వలేదు.
తల్లికి వందన పేరుతో ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. జిల్లాలోని 2,35,654 మందికి రూ. 353.48 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు.
నెలకు రూ. 3 వేలు నిరుద్యోగభృతి అన్నారు. జిల్లాలో 4,77,557 కుటుంబాల పరిధిలో ఇంటికొక్కరు అనుకున్నా వారందరికీ చెల్లించాల్సిన రూ. 143. 26 కోట్లలో పైసా రాలేదు.
మహిళలకు ప్రతినెల రూ. 1500 ఇస్తామన్నారు. జిల్లాలో 19 నుంచి 59 ఏళ్ల వయస్సున్న వారు 6,61,841 మంది. వీరందరికీ ఏడాదికి రూ. 11,913 కోట్లు ఇవ్వాలి. ఇప్పటికీ ఆ ఊసే మరిచారు.
ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పారు. జిల్లాలో మొత్తం 4,60,836 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మూడు ఉచిత సిలిండర్లకు ఒక్కొక్కరికి రూ. 2,700 చొప్పున ఇవ్వాలి. ప్రభుత్వం 3 లక్షల మందిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. మిగతా వారికి ఎగనామం పెట్టింది.
మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమన్నారు. జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల గణాంకాల ప్రకారం రోజూ 90 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదు.
ఊరూరా బెల్ట్ షాపులు
జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపులు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. గ్రామగ్రామాన ఇప్పటికే షాపులు పెట్టారు. బెల్టు షాపులకు రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్లు కూడా తమ్ముళ్లు వసూలు చేస్తున్నారు. మద్యం డోర్ డెలివరీ సదుపాయం కూడా కల్పించారు. పేదల బలహీనతను ఆసరా చేసుకుని వారిని నిత్యం మత్తులో ముంచెత్తి అందినకాడికి దోచుకుంటున్నారు.
రెడ్ బుక్ పేరిట అరాచకాలు
రెడ్ బుక్ పాలనను జిల్లాలో అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసిన సామాన్యా ప్రజలను సైతనం టార్గెట్ చేస్తున్నారు. పలుచోట్ల హత్యలు చేస్తున్నారు. దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి జైళ్ల చుట్టూ తిప్పుతూ రాక్షసానందం పొందుతున్నారు. వేమూరు, రేపల్లె, అద్దంకి, పర్చూరు ప్రాంతాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా.. వారిపైనే అక్రమ కేసులు బనాయించారు. ఇలా పలువుర్ని జైళ్లకు పంపారు. వారి ఇళ్లను కూడా వదిలిపెట్టకుండా కూలగొట్టారు.
● నగరం మండలం దాసరిపాలెంకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు నున్నా భూషయ్యను పచ్చ పార్టీ నాయకులు ఏకంగా హత్య చేశారు. రెడ్ బుక్ పాలన పేరిట ఇప్పటికే ఎనిమిదికిపైగా హత్యలు జరిగాయి.
● బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆయనపై వరుస కేసులు బనాయించి హింసిస్తోంది.
● వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం అద్దేపల్లి ఎస్సీ కాలనీలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పచ్చ పార్టీ వారు పెట్రోల్ పోసి తగులబెట్టగా నిరసనకు దిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబుపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు.
● పర్చూరు నియోజకవర్గం యద్దనపూడి మండలానికి చెందిన పలువురు ఎస్సీ నేతలపై పచ్చ ప్రభుత్వం రౌడీషీట్లు ఓపెన్ చేసి కక్షపూరితంగా వ్యవహరించింది.
● రేపల్లె నియోజకవర్గం చెరకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెంకు చెందిన దళిత నాయకుడు రాజ్కుమార్ ఇంటిపై దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు.
● ఇదే మండలం గుళ్లపల్లికి చెందిన మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావుపై పలుమార్లు దాడులకు యత్నించారు. ఆయన డ్రైవర్ గాలి సంపత్కుమార్ అనే దళితుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
● అద్దంకి మండలం ధర్మవరానికి చెందిన వైఎస్సార్సీపీ మండల నేత ప్రభాకరరెడ్డి, ఆయన అనుచరులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఆయన పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టారు. జేసీబీలను తగులబెట్టారు.