
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
బాపట్ల టౌన్: భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితుడిని బుధవారం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను డీఎస్పీ రామాంజనేయులు రూరల్ పోలీస్స్టేషన్లో బుధవారం సాయంత్రం వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ... మండలంలోని చెరువు జమ్ములపాలెం గ్రామం, ఆనంద్నగర్కు చెందిన దాసరి హరీష్ అలియాస్ దాసు ఈ నెల 9న తన భార్య సుభాషిణి(27) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పటించాడు. తీవ్ర గాయాలతో బయటకు వచ్చేసరికి ఆమెను కాపాడేందుకు ఇంటిపక్కనే ఉన్న కొప్పుల సుధారాణి ప్రయత్నించిందన్నారు. కాపాడితే తనను కూడా చంపుతానని బెదిరించాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాధితురాలి కేకలు విని గ్రామస్తులు గుమికూడటంతో నిందితుడు అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పారిపోయాడు. సుభాషిణిని చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలిస్తుండగా మృతి చెందింది. హరీష్ అలియాస్ దాసును బుధవారం పట్టణంలోని కమ్మ కల్యాణ మండపం సమీపంలో అరెస్ట్ చేశామన్నారు. నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా త్వరితగతిన చార్జిషీట్ తయారు చేసి కోర్టుకు సమర్పిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు, ఎస్ఐ ఐ. శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.