
తడ‘బడి’న చదువులు
బాపట్ల టౌన్ :పిల్లలను బడికి పంపించాలంటేనే తల్లిదండ్రులు నెల రోజుల ముందు నుంచే కలవరానికి గురవుతున్నారు. రూ.వేలకు వేలు ఫీజులు కట్టాల్సి వస్తోంది. పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, యూనిఫాం, స్కూల్ బస్సు ఫీజులు వెరసి తల్లిదండ్రులకు రూ. 20 నుంచి రూ.30 వేలు కూడా సరిపోని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు వాపోతున్నారు. వేసవి సెలవులు అయిపోతున్నాయంటేనే వారిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బడి తెరిస్తే ఫీజులు ఎలా కట్టాలా...? అంటూ మధ్యతరగతి, పేద కుటుంబాలు సతమతం అవుతున్నాయి.
ఎల్కేజీ నుంచే భారీగా..
ఎల్కేజీలో పిల్లలకు అంతగా ఏమీ నేర్పరు. అయినప్పటికీ ఓ మోస్తరు ప్రైవేటు స్కూల్లోనూ విద్యార్థికి రూ. 10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. అదే కార్పొరేట్ స్కూళ్లయితే సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పి రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక పదో తరగతి వరకు అయితే గ్రామీణ, మండల స్థాయి బడుల్లో రూ. 20 వేల నుంచి రూ.30 వేలు తీసుకుంటున్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో రూ. 50 నుంచి రూ.70 వేలు పైనే వసూలు చేస్తున్నారు. వీటికి యూనిఫామ్ పేరిట మరో రూ. 5 వేలు, బస్సు ఫీజు దూరాన్ని బట్టి నెలకు రూ. 1500 నుంచి రూ.2500 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇక పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఆయా స్కూళ్లలోనే తప్పనిసరిగా కొనాలని నిబంధన పెట్టి రూ. పది వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా పాఠశాల మొదలయ్యేటప్పుడు పెట్టాల్సిన ఖర్చు కావడంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.
రకరకాల పేర్లతో వసూలు
ఇక తరగతులు జరిగే కొద్దీ ఏడాది చివరకు వచ్చేసరికి గైడ్లు, క్వశ్చన్ బ్యాంక్లు, స్టడీ మెటీరియల్, పరీక్షల ఫీజులు, ఐడీ కార్డులు, డైరీలు, వెల్కం, ఫేర్వేల్ పార్టీలు, వార్షికోత్సవాలు.. ఇలా వివిధ పేర్లతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే మధ్య తరగతి కుటుంబాలు అప్పు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆయా కార్పొరేట్ స్కూళ్లు ఐఐటీ, ఒలింపియాడ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా రూ. 4 వేల నుంచి రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖాధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫాం, నోట్పుస్తకాలు, బస్సుల ఫీజులు, పాఠశాల ఫీజు వసూళ్ల విషయంలో చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా నాడు–నేడుతో వాటి రూపురేఖలనే మార్చేశారు. డిజిటల్ తరగతి గదులు, తరగతి గదిలో ఫ్యాన్లు, బల్లలు, ఆకర్షణీయమైన బ్లాక్బోర్డులు, మరుగుదొడ్లు వంటి సకల వసతులతో బడులు పిల్లలకు స్వాగతం పలికేవి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది ముగిసినా నేటివరకు ఒక్క పాఠశాలలో కూడా అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవు. కనీసం నాడు–నేడు పనుల్లో మిగిలిన వాటిని కూడా పూర్తి చేయలేదు. నిధులు ఇవ్వకుండా అర్ధాంతరంగా నిలుపుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై కూటమి సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఫీజులపైనా నియంత్రణ ఉండేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కూటమి పాలనలో బడుగు కుటుంబాల్లోని పిల్లలకు విద్యా అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో నూతన విద్యాసంవత్సరానికి స్వాగతం పలకనున్నాయి. ప్రైవేటు బడుల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో కన్నవారికి పెద్ద కష్టమే వచ్చి పడింది. అటు సర్కారు పాఠశాలకు పంపలేక.. ఇటు ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని తట్టుకోలేక సతమతం అవుతున్నారు. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇస్తానన్న సాయం కూడా అందక విలవిల్లాడుతున్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో
కొరవడిన నియంత్రణ
విద్యార్థుల తల్లిదండ్రులకు
తప్పని ఆర్థిక కష్టాలు
బడులు తెరుస్తుండటంతో
కన్నవారిలో మొదలైన కలవరం
ప్రభుత్వ పాఠశాలల్లో అస్తవ్యస్తంగా
ఉపాధ్యాయుల బదిలీలు
పూర్తికాని అభివృద్ధి పనులతో
విద్యార్థులకు అవస్థలు
పిల్లలను చదివించేందుకు
ఆసక్తి చూపని తల్లిదండ్రులు
ప్రైవేటు పాఠశాలల ఫీజులపై
నియంత్రణ ఉండాలంటున్న నిపుణులు
నేటి నుంచి తెరుచుకోనున్న
ప్రభుత్వ పాఠశాలలు

తడ‘బడి’న చదువులు