వ్యవసాయ శాఖలో బదిలీలు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ శాఖలో బదిలీలు

Jun 11 2025 8:50 AM | Updated on Jun 11 2025 12:47 PM

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు నంద్యాల జిల్లాకు, కృష్ణా జిల్లాలో పని చేస్తున్న యు.నరసింహారావును గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారిగా బదిలీ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

● గుంటూరు ఏడీఏగా పని చేస్తున్న తోటకూర శ్రీనివాసరావును మంగళగిరికి, మంగళగిరి ఏడీఏగా పనిచేస్తున్న గాయం శ్రీనివాసరెడ్డిని బాపట్లలోని రీజనల్‌ సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌కి, బాపట్ల జిల్లా పర్చూరులో ఏడీఏగా పనిచేస్తున్న ఎన్‌.మోహనరావును గుంటూరు, గుంటూరులోని భూసార పరీక్ష కేంద్రంలో ఏడీఏగా పనిచేస్తున్న కె.అన్నపూర్ణమ్మను బాపట్ల ఏడీఏగా బదిలీ చేశారు.

● గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారిగా యు.నరసింహారావు బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. అయితే, ఆయన ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత కడప జిల్లాలో డీడీఏగా పనిచేస్తున్న ఎ.నాగేశ్వరరావు గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించేలా ఢిల్లీరావు ఉత్తర్వులు జారీ చేశారు.

పలు రైళ్ల రద్దు

లక్ష్మీపురం: సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ వయా గుంటూరు రైలును తాత్కాలికంగా రద్దు చేసినట్లు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ప్రదీప్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్‌ (07401) సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ రైలు ఈనెల 12న, రైలు నంబర్‌ (07402) కాకినాడ టౌన్‌–సికింద్రాబాద్‌ రైలు ఈనెల 13న తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

చెరువులో పడి వ్యక్తి మృతి

ప్రత్తిపాడు: ప్రమాదవశాత్తూ చెరువులో పడి వ్యక్తి మరణించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు గ్రామానికి చెందిన షేక్‌ బుజ్జి(64) హుస్సేన్‌ స్థానిక పోలిశెట్టి టొబాకో కంపెనీలో క్లినిక్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలానే విధులకు హాజరైన ఆయన కంపెనీ ఆవరణలో ఉన్న దేవుని విగ్రహాలకు పూజ చేసేందుకు గాను వాటిని శుభ్రపరిచేందుకు ప్రాంగణంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదశాత్తూ చెరువులో పడిపోయాడు. గమనించిన కోటయ్య అతని చేతిని అందించి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కంపెనీ సిబ్బంది సమాచారాన్ని హుస్సేన్‌ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని వెలికి తీయాల్సి వచ్చింది. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు మృతుని భార్య షేక్‌ అఫ్జలున్‌బి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె. నాగేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక యువతి ఆత్మహత్య

తెనాలి రూరల్‌: తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మహిళ అపార్ట్‌మెంట్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ గంగానమ్మపేటకు చెందిన చీమకుర్తి సుబ్రహ్మణ్యం(60) మంగళవారం మధ్యాహ్నం గుండెల్లో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యశాల సిబ్బంది చెప్పడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే సుబ్రహ్మణ్యం పెద్ద కుమార్తె లక్ష్మీశ్రావణి(23) వారి ఇంటి సమీపంలోని అపార్ట్‌మెంట్‌ పైకి ఎక్కి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఏడాది కిందట విజయవాడకు చెందిన వ్యక్తితో వివాహమైంది. మనస్పర్ధల కారణంగా పుట్టింట్లో ఉంటూ ఎంబీఏ చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement