
పొగాకు రైతులను ఆదుకోవాలి
లక్ష్మీపురం: పొగాకు కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య కోరారు. నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ బృందంతో కలసి ఇద్దరూ మంగళవారం గుంటూరులోని ఎలైన్స్ కేర్ అధినేత చేబ్రోలు రవీంద్ర, పోలిశెట్టి ఇండస్ట్రీ అధినేత పోలిశెట్టి శ్యాంలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది పొగాకుకు ధర ఉండటంతో రైతులు ఈ ఏడాది భారీగా సాగు చేశారని తెలిపారు. కొనుగోలు చేయడానికి కంపెనీలు ముందుకు రాకపోవడంతో అప్పుల్లో కూరుకు పోయి, తీవ్ర ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని వారికి వివరించారు. ఇప్పటికే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన రైతులు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘాల ఆందోళనతో ప్రభుత్వం కూడా మార్క్ఫెడ్తో కొనుగోలు ప్రారంభించిదని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలు కూడా కొనుగోలు త్వరగా చేస్తే రైతులకు రేటు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇతర కంపెనీలతో కూడా త్వరలో చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో తూర్పు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మొహమ్మద్ ముస్తఫా, పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు.
కంపెనీలతో చర్చలు జరిపిన రైతు సంఘ నాయకులు