పెద్దమండ్యం/గాలివీడు: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం మండల కేంద్రంలో మంగళవారం పశువుల అక్రమ రవాణా కలకలం రేపింది. 10 కంటైనర్లలో 510 పశువులను తరలిస్తుండగా.. స్థానిక యువకులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని అనంతపురం, హిందూపురం, గోరంట్ల, పత్తికొండ తదితర ప్రాంతాల నుంచి ఈ పశువుల రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి రైతులు, వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేసి తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లను వినియోగిస్తున్నారు. వీటి రవాణా వెనుక బడాడాన్ ఉన్నట్లు తెలుస్తోంది. కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు ప్రాంతానికి చెందిన ఒకరు సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక యువకులు తంబళ్లపల్లె పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి కంటైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కంటైనర్లలో 165 ఎద్దులు, 345 దున్నపోతులు, ఎనుములు ఉన్నాయి. వీటిని పుంగనూరు, తమిళనాడు, కేరళ ప్రాంతాలలో జరిగే సంతలకు తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వాటికి రాయచోటి సమీపంలోని మామిడి తోటలో వసతి, సంరక్షణ కల్పించారు. అలాగే గాలివీడు మండల కేంద్రంలోని వెలిగల్లు ప్రాజెక్టు సమీపాన అక్రమంగా తరలిస్తున్న గోవులను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.


