మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6, 6.30 గంటలకు బస్సులు బయలుదేరతాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయని తెలిపారు.
సాక్షి, మదనపల్లె: స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం(పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఫిర్యాదులను అధికారులు స్వీకరిస్తారని తెలిపారు.సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో కూడా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది.అమ్మా..కరుణించమ్మా అని వేడుకున్నారు. అర్చకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి చీరసారె సమర్పించి భక్తి చాటు కున్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.


