మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతును సకాలంలో ఆసుపత్రికి తరలించడంతోపాటు, ఆయన వద్ద ఉన్న సుమారు లక్ష రూపాయల నగదును కుటుంబ సభ్యులకు అప్పగించి మొలకలచెరువు 108 సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం గందోడిపల్లికి చెందిన రైతు రెడ్డిప్పరెడ్డి(55) అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలోని వ్యాపారులకు అప్పుగా ఇచ్చిన ఎరగ్రడ్డల డబ్బు వసూలు చేసుకునేందుకు వస్తుండగా, మార్గ మధ్యంలోని పులికల్లు మిట్ట వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న మొలకలచెరువు 108 సిబ్బంది మధుసూదనరెడ్డి, శబరీష్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రైతు రెడ్డిప్పరెడ్డి మృతి చెందాడు. ప్రమాద స్థలంలో రైతు వద్ద లభించిన సుమారు లక్ష రూపాయల నగదును 108 సిబ్బంది భద్రపరిచి, మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు కృషి చేయడమే కాకుండా, నగదును నిజాయితీగా అప్పగించిన 108 సిబ్బందిని స్థానికులు, బాధిత కుటుంబీకులు అభినందించారు.


