సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. కుటుంబాలతో వచ్చిన పర్యాటకులు సందడి చేస్తూ.. పిల్లలు, పెద్దలు ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులకు సెలవులు ఉండటం, బక్రీద్ అనంతరం వచ్చిన ఆదివారం కావడంతో రద్దీ అధికంగా నెలకొంది. పర్యాటకులు ప్రకృతి సందర్శన ప్రాంతాలైన గాలిబండ వ్యూ పాయింట్లు, అటవీశాఖ పర్యావరణ సముదాయంలో ప్రకృతి అందాలను తిలకించారు. అటవీశాఖ పార్కులో చిన్నారులు సందడి చేశారు. ప్రకృతి అధ్యయన కేంద్రం తిలకించి అటవీ విషయాలను తెలుసుకున్నారు. జిల్లాతోపాటు శ్రీ సత్యసాయి, అనంతపురం, కడప, చిత్తూరు, కర్ణాటక, తమిళనాడుకు చెందిన పర్యాటకులు సేద తీరేందుకు వచ్చారు. రద్దీ కారణంగా కొండ రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.


