సాక్షి, మదనపల్లె: ‘సర్’ కార్యక్రమం ద్వారా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, అభిమానుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. ఆ కుట్రలను తిప్పి కొట్టాలని వైఎస్ఆర్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం బి.కొత్తకోటలో తంబళ్లపల్లె నియోజకవర్గం, మదనపల్లెలో నియోజకవర్గ బీఎల్ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఓట్ల తొలగింపుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తారని అన్నారు. సర్ విషయంలో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పుంగనూరులో 90 వేల ఓట్ల తొలగింపునకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లలో చాలామంది బెంగళూరు, పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. వారిని స్వగ్రామాలకు రప్పించి ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించాలని కోరారు.సర్ విషయంలో క్యాడర్ను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని అన్నారు. దీనికోసం మాజీ సీఎం వైఎస్.జగన్ పరిశీలకులను పంపి దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ బీఎల్ఏలు ప్రతి బూతులోని ఓటర్లను పరిశీలించాలన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అధికార ంలో ఉన్న పార్టీలు సర్ కారణంగా అధికారం కోల్పోవడమే గాక ఇద్దరు ముఖ్యమంత్రులు ఓటమిపాలయ్యారని గుర్తు చేశారు. ఏపీలో స్థానిక ఎన్నికలను సర్ తర్వాత నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 20 నుంచి 30 ఓట్లు తొలగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఎల్ఏలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటును పరిశీలించాలని కోరారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ తంబళ్లపల్లెను సర్ ద్వారా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. దీనిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ సర్పై అవగాహన కల్పించారు. మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా బూత్ కమిటి అధ్యక్షులు నడివీధి సుధాకర్, పరిశీలకులు అనీషారెడ్డి, బాబ్జాన్, జింకా చలపతి, సీనియర్ నేత శ్రీనాథ్ రెడ్డి, మాజీ చైర్మన్ మనూజ, మాజీ వైస్ చైర్మన్ నూర్ ఆజం, జిల్లా ఉపాధ్యక్షులు పాగొండ ఖలీల్,హరీష్కుమార్ రెడ్డి, కొండా సిద్ధార్థ, రెడ్డిశేఖర్ రెడ్డి, జడ్పిటిసిలు ఉదయ్ కుమార్, రామచంద్రారెడ్డి, ఎస్ఏ కరీముల్లా, షేక్ ఇర్ఫాన్ పాల్గొన్నారు.
బి.కొత్తకోటలో జరిగిన సమావేశానికి హాజరైన బీఎల్ఏలు, నాయకులు, మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్రంలో ఆకేపాటి
సర్పై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
బీఎల్ఏల శిక్షణలో రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి,జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి


