ఆరు దశాబ్దాల బంధానికి అరుదైన ముగింపు ! | - | Sakshi
Sakshi News home page

ఆరు దశాబ్దాల బంధానికి అరుదైన ముగింపు !

May 31 2026 1:30 AM | Updated on May 31 2026 1:30 AM

ఆరు దశాబ్దాల బంధానికి అరుదైన ముగింపు !

కూటమి ప్రభుత్వం విఫలమైంది

రాయలసీమ రైల్వేలకు న్యాయం చేయాలి

రాజంపేట: రైల్వే చరిత్రలో చారిత్రాత్మక అధ్యాయం మొదలుకానుంది. అక్టోబరు 2, 1966లో ఆవిర్భవించిన దక్షిణ మధ్య రైల్వేతో కడప రైల్వే విభాగానికి ఉన్న ఆరు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది . కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్ర కారం, జూన్‌ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దేశంలోనే 18వ జోన్‌గా ఏర్పాటైన దక్షిణకోస్తా రైల్వేజోన్‌ పరిపాలన అధికారికంగా ప్రారంభం కానుంది. ఇన్నాళ్లు సికింద్రాబాద్‌తో ఉన్న జోన్‌ బంధం వీడి, ఇకపై విశాఖ జోన్‌తో కొత్త ప్రస్థానం మొదలవుతుంది. ఏపీ విభజన చట్టం హామీల మేరకు వైజాగ్‌ రైల్వే జోన్‌ పురుడు పోసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కొత్త జోన్‌ ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో శాశ్వత భవన నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, తాత్కాలికంగా ఎంపిక చేసిన ‘డెక్‌’ భవనంలో జోనల్‌ ఆఫీసును ఏర్పాటు చేశారు. జూన్‌ 1న ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సాధారణంగానే ఈ జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

కొత్త జోన్‌లోనూ కడపకు అన్యాయమేనా..?

విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జోన్‌పై కడప జిల్లా వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ, జిల్లా రైల్వే రంగంలో దశాబ్దాలుగా నలుగుతున్న పెండింగ్‌ సమస్యలు ఎటూ తేలడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్‌లో ప్యాసింజర్‌ రైళ్లు నడిపించాలనే డిమాండ్‌ ఇప్పటికీ నెరవేరలేదు. దశాబ్దాల కల అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్‌ పనులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ముద్దనూరు–ముదిగుబ్బ, కంభం–ప్రొద్దుటూరు, భాకరాపేట–గిద్దలూరు రైలుమార్గాలు కేవలం సర్వేలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రమైన కడప రైల్వే స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తామన్న హామీ మూలనపడింది. ఒకప్పుడు అత్యంత కీలక కేంద్రమైన నందలూరులో ప్రత్యామ్నాయ రైల్వే పరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. కనీసం అన్ని రైళ్లకు ఇక్కడ వాటరింగ్‌ సదుపాయం కల్పించే ప్రతిపాదన కూడా పెండింగ్‌లో పడింది. కొత్త జోన్‌ కేంద్రమైన విశాఖపట్నానికి వెళ్లేందుకు జిల్లా వాసులకు కనీసం ఒక్క ప్రత్యక్ష రైలు కూడా అందుబాటులో లేదు. కొత్త జోన్‌కు వెళ్లే ఏకై క రైలు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే కావడం, అది ఎప్పుడూ రద్దీగా ఉండటంతో జిల్లా ప్రజలు, రైల్వే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. జిల్లా మీదుగా ఇప్పటివరకు కనీసం ఒక్క వందేభారత్‌ రైలు కూడా నడపలేదు.

ఆదాయానికి గండి.. బదిలీల తర్జనభర్జనలు

కొత్తగా ఏర్పాటు కాబోతున్న దక్షిణ కోస్తా జోన్‌ ప్రారంభంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ఈస్ట్‌కోస్ట్‌ పరిధిలోని అత్యంత కీలకమైన ’కెకె లైన్‌’ (కోరాపుట్‌–కిరండూల్‌ లైన్‌) తిరిగి ఈస్ట్‌ కోస్ట్‌ జోన్‌ పరిధిలోనే ఉండిపోవడంతో దాదాపు రూ. 9,950 కోట్ల ఆదాయాన్ని కొత్త జోన్‌ నష్టపోతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కొత్త జోన్‌కు రూ. 25 వేల కోట్ల ఆదాయం ఉండాల్సి ఉండగా, ఈ మార్పుల వల్ల రూ. 17,500 కోట్ల ఆదాయం మాత్రమే ఉంటుందని అంచనా. మరోవైపు, జోన్‌ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల వ్యవహారంపై రైల్వే శాఖలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వీటిపై డీఆర్‌ఎంలతో రైల్వేబోర్డు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. కొందరు ఉద్యోగులు తెలంగాణా ప్రాంతంలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. సదరన్‌ రైల్వే జోన్‌లో భాగంగా 1956లో ఏర్పాటైన గుంతకల్‌ డివిజన్‌, అక్టోబరు 2, 1977లో దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో విలీనమైంది. ఇప్పుడు దక్షిణకోస్తా జోన్‌లోకి వెళ్లడంతో దీని సరిహద్దుల్లో పలు మార్పులు చేర్పులు జరిగాయి.

రేపటి నుంచే దక్షిణకోస్తా రైల్వే జోన్‌ అధికారిక కార్యకలాపాలు

సికింద్రాబాద్‌ వీడి.. విశాఖ

‘డెక్‌’భవనం గూటికి కడప రైల్వే

ఆదాయం కోల్పోవడంపై విమర్శలు

సీమ రైల్వేలకు న్యాయం చేయాలని ఎంపీల డిమాండ్‌

కృష్ణపట్నం–ఓబులవారిపల్లె ప్యాసింజర్‌ లైన్‌, కడప–బెంగళూరు ప్రాజెక్టులపై జిల్లా వాసుల ఆశలు

కొత్తగా ఏర్పాటైన దక్షిణకోస్తా జోన్‌కు రావలసిన ఆదాయాన్ని రాబట్టడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ జోన్‌కు రావాల్సిన భారీ ఆదాయం ఈస్‌కోస్ట్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఈ విషయమై లోక్‌సభలో కూడా ప్రస్తావించాను. తిరుపతి కేంద్రంగా బాలాజీ (తిరుపతి) డివిజన్‌ చేయాలన్న డిమాండ్‌ను నెరవేర్చకుండానే జోన్‌ను ప్రారంభించడం బాధాకరమని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు.

– పీవీ మిథున్‌రెడ్డి, రాజంపేట ఎంపీ

దక్షిణ మధ్య రైల్వే నుంచి 60 ఏళ్ల తర్వాత విడిపోయి దక్షిణకోస్తా రైల్వేలోకి బదిలీ అయిన రాయలసీమ రైల్వేలకు ఇప్పుడైనా పూర్తి న్యాయం చేయాలి. వైఎస్సార్‌ కడప జిల్లా మీదుగా కొత్త రైళ్లను తీసుకురావాలి. వైఎస్సార్‌ మానసపుత్రిక అయిన కడప–బెంగళూరు రైల్వేలైన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీమ రైల్వే ధిలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైలు మార్గాలను పూర్తి చేసే దిశగా నూతన ఎస్సార్‌ యాజమాన్యం ఆలోచన చేయాలి. అలాగే తిరుపతి డివిజన్‌ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలి

– మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు

Advertisement
 
Advertisement
Advertisement