మదనపల్లె సిటీ : బక్రీద్ ప్రార్థనలను జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశద్ధలతో జరుపుకున్నారు. గురువారం మదనపల్లె, రాయచోటి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజవర్గ కేంద్రాలతో పాటు వాల్మీకిపురం, గుర్రంకొండ,బి.కొత్తకోట, చిట్వేలి, లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రాల్లో ఈద్గాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాలలో మతగురువులు,ఉలేమాలు, ముఫ్తీలు ధార్మికోపన్యాసం చేశారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగనిరతియే బక్రీద్ పరమార్థమని పేర్కొన్నారు. ప్రవక్త హజరత్ ఇబ్రహీం సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి స్వార్థాన్ని వీడి ఆదర్శవంత సమాజాన్ని నిర్మించాలన్నారు. ఇస్లాం సూచించిన పంచసూత్రాలను పాటించాలన్నారు. ధాన,ధర్మాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు అలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా మసీదుల నుంచి ముస్లింలు ఖబ్రస్థాన్లకు వెళ్లి పూర్వీకుల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు. మదనపల్లెలో ఈద్గాలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్అహ్మద్ బక్రీద్ శుభాకాంక్షలు సందేశం ద్వారా పంపారు.
భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు


