వాల్మీకిపురం : స్థానిక తరిగొండ వెంగమాంబ ఆర్చీ సమీపంలో గుర్రంకొండ నుంచి వాల్మీకిపురం వస్తున్న బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బుధవారం రాత్రి గుర్రంకొండ నుంచి తరిగొండ మీదుగా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు వాల్మీకిపురం సమీపంలోకి చేరుకుంది. స్థానిక తరిగొండ ఆర్చీ సమీపంలో ఒక్కసారిగా బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో బస్సులో ఉన్న దాదాపు 30 మంది ప్రయాణికులు ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించి బస్సులో నుంచి కిందకు దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని బస్సులో నుంచి వస్తున్న పొగలపై నీరు చల్లారు. బస్సులో ఉన్న బ్యాటరీ వైర్లు షార్ట్ కావడంతో పొగలు వ్యాపించినట్లు గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. నెల రోజులుగా మండలంలో ఎక్కడబడితే అక్కడ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు నిలిచిపోతుండడంతో ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి కండీషన్లో ఉండే బస్సులను నడపాలని ప్రయాణికులు, మహిళలు కోరుతున్నారు.


