పీలేరు రూరల్ : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ధ్యేయమని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు శవన్నగారి బాలాజి అన్నారు. బుధవారం స్థానిక కోటపల్లె శ్రీనివాస కల్యాణమండపంలో జిల్లా అభ్యాసవర్గ 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సాధించడానికి తమ సంఘం కృషి చేస్తోందన్నారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తిరిగి పునరుద్దరించే వరకు తమ సంఘం పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అనురాధ, ఎంఈవో రెడ్డిబాషా, ఆపస్ జిల్లా అధ్యక్షులు మంద నరసింహులు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, సహఅధ్యక్షులు పచార్చర్ల సుధాకర్, సంఘ కార్యకర్త కొండారెడ్డి, ఆర్థిక కార్యదర్శి శివశంకర్, నాయకులు వేణుగోపాల్, సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, వెంకటరామిరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


