మదనపల్లె సిటీ: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. ఈనెల 25వతేదీ నుంచి జూన్ నాలుగో తేదీ వరకు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి–2026 పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ప్రస్తుతం జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్ష రుసుం, ఇతర చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మదనపల్లెలో 5, రాయచోటిలో 4, రాజంపేటలో 3, రైల్వేకోడూరులో 2, బి.కొత్తకోట 2, గుర్రంకొండ, కలికిరి,పీలేరులో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు అన్ని ప్రభుత్వ శాఖలు నిమగ్నమయ్యే విధంగా ఇటవల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఉత్తర్వులు జారీ చేశారు.
పది తప్పిన విద్యార్థులు 3,020 మంది
మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని 3,020 మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. బాలికలు 1,168 మంది, బాలురు 1,852 మంది ఉన్నారు. 19 మంది డిపార్టుమెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, 200 మంది ఇన్విజిలేటర్లకు విధులు కేటాయించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.
ఓపెన్ పరీక్షలు సైతం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ పది, ఇంటర్మీడియట్కు సైతం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 25 (సోమవారం) నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి నుంచి జూన్ 4 వరకు పరీక్షలు
జిల్లాలో 19 కేంద్రాలు


