సాక్షి, మదనపల్లె: మదనపల్లె మండల పరిధిలోని తట్టివారిపల్లె లేఅవుట్లో టిడ్కో ఫ్లాట్లు ఖరారైన నిరుపేదలకు కూటమి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇళ్లు కట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడమే కాకుండా.. లబ్ధిదారులు గతంలో చెల్లించిన డిపాజిట్ సొమ్మును అధికారికంగా వెనక్కి ఇచ్చేసేందుకు (రిఫండ్) ప్రభు త్వం సిద్ధమైందని టిడ్కో అధికారులు స్పష్టం చేశారు.
డిపాజిట్లు వెనక్కి..
ఫ్లాట్లు లేవని తేల్చేసిన సర్కార్!
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు పొందిన పేదలు తమకు కేటాయించిన ఫ్లాట్ల రకాన్ని బట్టి ప్రభుత్వానికి భారీగా డిపాజిట్లు చెల్లించారు.
365 చదరపు అడుగుల ఫ్లాటుకు: ఒక్కో లబ్ధిదారుడు రూ.12,500 చొప్పున చెల్లించారు(మొత్తం 720 మంది).
430 చదరపు అడుగుల ఫ్లాటుకు: ఒక్కో లబ్ధిదారుడు రూ.25,000 చొప్పున డిపాజిట్ చేశారు (మొత్తం 336 మంది).
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు 25 శాతంలోపే జరిగాయనే సాకుతో ఈ రెండు రకాల నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. అప్పటి నుండి పేదల సొమ్ము ప్రభుత్వం వద్దే మురిగిపోయింది. ప్రస్తుతం ఈ సొమ్మును లబ్ధిదారులకు వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని టిడ్కో అధికారులు వివరించారు. ఈ నిర్ణయంతో 1,056 మంది పేదలకు టిడ్కో అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు రావనే విషయం పూర్తిగా తేలిపోయింది.
మదనపల్లె పేదల టిడ్కో ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర
‘25% పనుల’ సాకుతో 365, 430 అడుగుల ఫ్లాట్ల ప్రాజెక్టు రద్దు
టిడ్కో... డబ్బు వెనక్కు తీస్కో అంటూ లబ్ధిదారులకు వంచన!
రోడ్డున పడ్డ 1,056 మంది నిరుపేద కుటుంబాలు
మరోవైపు, టిడ్కో ఫ్లాట్లు కోల్పోయిన ఈ 1,056 మంది లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఇంటి స్థలాలు కేటాయించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ పేదలకు స్థలాలు ఎక్కడ ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? అనే విషయాలపై ప్రభుత్వం వద్ద ఎలాంటి విధివిధానాలు కానీ, స్పష్టత కానీ లేదు. అటు ఆశ పెట్టుకున్న టిడ్కో ఇల్లు దక్కక, ఇటు ప్రత్యామ్నాయ స్థలం ఎక్కడో తెలియక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టపోయిన తమకు తక్షణమే న్యాయం చేయాలని లబ్ధిదారులు మదనపల్లెలో డిమాండ్ చేస్తున్నారు.


