వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో సీపీఎల్ –2 క్రికెట్ మ్యాచ్లు హోరాహోరీగా జరుగుతున్నాయి. శుక్రవారం హైపెరియన్, ఎన్కే స్పోర్ట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎన్కే స్పోర్ట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లుకు 186 పరుగులు చేసింది. హైపెరియన్ ప్లేయర్ సల్మాన్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన హై పెరియన్ జట్టు 18.3 ఓవర్లకు 4 వికెట్ల తేడాతో 191 పరుగులు చేసి విజయం సాధించింది. సోహన్ రెడ్డి 45 బంతుల్లో 83, జయంత్ రెడ్డి 23 బంతుల్లో 53 పరుగులు చేశారు. సోహన్రెడ్డికి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు, ట్రోఫీని స్థానిక ఎంపీడీవో మనోహర రాజు, పంచాయతీ ఈవో రవీంద్రనాథ్ అందించారు. మధ్యాహ్నం స్పార్టన్ వారియర్స్, ఆదిత్య బీఆర్ జట్ల మధ్య జరిగి మ్యాచ్ను స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి టాస్ వేసి ప్రారంభించారు. ఆదిత్య బిఆర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. జట్టులో రెడ్డిరుషీల్ 59 బంతుల్లో 95 పరుగులు చేసి నాటవుట్గా నిలిచాడు. 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్పార్టన్ వారియర్స్ 18.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటయింది.ఈ కార్యక్రమంలో సునీల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీని అడ్డుకునే కుట్ర
పుంగనూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్రెడ్డిలు పుంగనూరు మండలం మేలుందొడ్డిలో సుమారు రూ.10 వేల కోట్లతో జర్మన్ పెప్పర్మోషన్ ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీకి 850 ఎకరాల భూ సేకరణ చేపట్టారు. ఫ్యాక్టరీకి అనుమతులు మంజూరు చేసి , పడమట కరువు ప్రాంతమైన పుంగనూరును పరిశ్రమల కారిడార్గా ఏర్పాటు చేశారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బస్సుల ఫ్యాక్టరీ పనులు పెండింగ్లో పడ్డాయి. ఇలా ఉండగా టీడీపీ చోటా నాయకులు కొంత మంది ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా మేలుందొడ్డి ప్రాంతంలో బస్సుల ఫ్యాక్టరీకి భూసేకరణ చేయవద్దంటూ శుక్రవారం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై పుంగనూరు ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వం మంజూరు చేసిన ఫ్యాక్టరీ ద్వారా సుమారు 10 వేల మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇలాంటి పనులను అడ్డుకోవడంతో నిరుద్యోగ యువతి, యువకులు టీడీపీ నాయకుల చర్యలను నిరసిస్తున్నారు.


