సాక్షి, మదనపల్లె: మదనపల్లె డివిజన్లోని నిమ్మనపల్లె వ్యవసాయ పరపతి సహకార సంఘంలో రూ.2.07 కోట్ల సంఘ నిధుల స్వాహాపై పోలీసు కేసు నమోదు కాకపోవడంపై సహకార శాఖ అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిమ్మనపల్లె సింగిల్ విండో సీఈఓగా పనిచేసిన హరినాథ్రెడ్డి రుణాలు మంజూరు చేసి వాటి సొమ్మును రికవరీ చేసినా జమ చేయలేదని వెలుగులోకి వచ్చింది. దీనిపై సహకార శాఖ అధికారులు విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా సహకార అధికారి గురుప్రకాష్ విచారణ అధికారిగా హబీబుల్లాను నియమించారు. ఇప్పుడు ఈ నిధుల స్వాహాపై సమగ్ర విచారణ సాగుతోంది. విచారణ సందర్భంగా హరినాథ్రెడ్డి బంగారం లేకున్నా, పెట్టినట్లు రికార్డులు సృష్టించాడు. ఊరు, పేరు లేని వ్యక్తుల పేరిట రుణాలు మంజూరు చేసి వాటిని సొంతంగా వాడుకున్నాడు. బంగారం పేరిట రుణాలు ఇచ్చినట్టు రికార్డులో పేర్కొన్నప్పటికీ వారికి సంబంధించిన చిరునామాలు, ఫోన్ నంబర్లు లేవు. హరినాథ్ రెడ్డి ఫోన్ నంబర్ రాయడం, తనిఖీల్లో బంగారం కనిపించకపోవడం, రుణాలు తిరిగి చెల్లించినట్టుగా న మోదు కావడం గుర్తించారు. దీంతో రూ.2, 07,80,000 నిధులను హరినాథ్ రెడ్డి స్వా హా చేసినట్లు నిర్ధారణ చేశారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణ మార్చి 7న నిమ్మనపల్ల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటిదాకా కేసు మాత్రం నమోదు కాలేదు. అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ విషయమై నిమ్మనపల్లె ఎస్సై రామకృష్ణను వివరణ కోరగా కేసు నమోదు చేయలేదని చెప్పారు. సహకార అధికారుల విచారణలో తేలిన వాస్తవ నివేదికను, వాటి రికార్డులను ఇవ్వాలని అధికారులను కోరినట్టు చెప్పారు. వీటిని అందజేశాక కేసు నమోదు చేస్తామని తెలిపారు.
నిమ్మనపల్లె సింగిల్ విండో వ్యవహారం


