గిట్టుబాటు ధర కల్పించాలి
ఎకరానికి 20బస్తాలలోపే దిగుబడి
● వేరుశనగ రైతుకు భారీ నష్టం
● మూడు నెలలుగా
సగానికి పడిపోయిన ధరలు
● సిండికేట్గా మారిన వ్యాపారులు
గుర్రంకొండ: జిల్లాలో రబీసీజన్లో వేరుశనగ పంట సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 50శాతం మాత్రమే దిగుబడి వచ్చింది. దీనికి తోడు గత మూడు నెలలుగా మార్కెట్లో ధరలు సగానికిపైగా తగ్గిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని వేరుశనగ వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి ఇష్టానుసారంగా ధరల్లో కోతలు విధిస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే బయట ప్రాంతాల్లో దిగుబడులు వస్తుండడంతో జిల్లాలో ధరలు తగ్గుతున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతులకు మాత్రం ప్రస్తుతం నిరాశే మిగిలింది. జిల్లాలో రబీసీజన్ల్లో సాధారణ సాగు విస్తీర్ణం 5324 ఎకరాలు ఉండగా ఈ సీజన్లో 1234 ఎకరాల్లో మాత్రమే రైతులు పంట సాగు చేపట్టారు. జలవనరులు, నీటి వసతి పుష్కలంగా ఉన్న పొలాల్లో మాత్రమే రబీసీజన్లో వేరుశనగ సాగు చేపడుతుంటారు. గత ఏడాది 2147 ఎకరాల్లో సాగు చేపట్టగా ఈ సంవత్సరం 1234 ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేపట్టడం గమనార్హం.
ఎకరం పొలంలో వేరుశనగ పంట సాగు చేపట్టడానికి రైతు ఆర్థిక పరిస్థితిని బట్టి రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. దుక్కుల దగ్గర నుంచి విత్తనాలు, ఎరువులు, డ్రిప్ పరికరాలు, పైప్లైన్లు, పంట అదునుకొచ్చాక కోత కూలీలు, కాయలను మార్కెట్కు తరలించే వరకు రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది.
ఎకరం పంట నూర్పిడికి రూ. 15 వేలు..
ప్రస్తుతం ఎకరం పొలంలో వేరుశనగ పంట నూర్పిళ్ల కు కోతల దగ్గర నుంచి యంత్రాలతో కాయలు వేరు చేసే వరకు రూ.15 వేలు వరకు ఖర్చు వస్తోంది. మొ దట పొలంలో చెట్లను పీకీ కుప్పలు వేయాలంటే కూలీలకు రూ.6200, తర్వాత పంట నూర్పిడి చేయాలంటే గంటకు యంత్రానికి రూ. 2200 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఎకరం పొలంలో సాగైన దిగుబడికి సుమారు నాలుగు గంటల పాటు యంత్రాలు పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఎకరానికి యంత్రాలకు అయ్యే ఖర్చు రూ. 8800 వరకు వస్తోంది.
సిండికేట్ ఎఫెక్ట్తో ధరల్లో భారీ కోతలు
ఓవైపు సగానికి పైగా పంట దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టాల్లో ఉంటే మార్కెట్లో మూడునెలలుగా ధరల్లో భారీ కోతలు విధిస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలోని వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి నట్టేట ముంచున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మార్కెట్లో వేరుశనగ బస్తా ధర ఫిబ్రవరిలో రూ. 5 వేల వరకు పలికింది. అయితే పంట కోతలు సీజన్ పుంజుకోవడంతో ధరల్లో భారీగా కోతలు విధించడం దారుణమని రైతులు అంటున్నారు. ప్రస్తుతం 3100లోపే ధరలు పలుకు తుండడం గమనార్హం. దీంతో మూడునెలల క్రితం ఉన్న ధరలతో పోల్చితే ఒక బస్తాపై రూ.1900 నుంచి రూ.2100 వరకు రైతులు నష్టపోతున్నారు.
బయట ప్రాంతాల్లో
మొదలైన దిగుబడులే కారణమా?
జిల్లాలో వేరుశనగ ధరలు పతనమవడానికి బయట ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మొదలైన పంట దిగుబడులే కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ఫిబ్రవరిలో దిగుబడులు ప్రారంభమైన సమయంలో బయట ప్రాంతాల్లో అసలే దిగుబడులు రాలేదని, అందువల్లే ఆనెలలో బస్తా ధర రూ. 5 వేలు వరకు పలికినట్లు వారు చెబుతున్నారు. ప్రస్తుతం అన్నమయ్యతో పాటు తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, పుట్టపర్తి, అనంతపురం జిల్లాల్లో వేరుశనగ పంట దిగుబడులు ప్రారంభభమయ్యాయి. వాటి ప్రభావంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. రైతుల వాదన మరో విధంగా ఉంది.. ఫిబ్రవరిలో పంటదిగుబడులు కొద్దిగా రావడం, మార్కెట్లో వేరుశనగకు డిమాండ్ ఉండడంతో వ్యాపారులు బస్తా ధర రూ. 5 వేలు పెట్టి కొనుగోలు చేశారని అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పంటకోతలు ఊపందుకున్నాయి. దిగుబడులు ఎక్కువగా వచ్చాయి. దీంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను ఇష్టానుసారం తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో రబీలో
వేరు శనగ
సాగు విస్తీర్ణం
రూ.70
వేలు
ఎకరం
పంటసాగుకు అయ్యే ఖర్చు
జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ పంట దిగుబడి సగానికి పడిపోయింది. గత సంవత్సరంతో పోల్చితే 50 శాతం దిగుబడి మాత్రమే రైతుకు అందింది. . గత ఏడాది ఒక చెట్టుకు సుమారు 30 నుంచి 40 కాయల వరకు దిగుబడి వస్తే.. ప్రస్తుతం ఒక చెట్టుకు 15 నుంచి 20 కాయల దిగుబడి మాత్రమే రావడంతో రైతులకు నష్టం వాటిల్లింది. సాధారణంగా ఎకరం పంట సాగు చేస్తే 40 బస్తాల కాయల దిగుబడి రావాల్సి ఉంది. ప్రస్తుతం 18 నుంచి 20 బస్తాల లోపే పంట దిగుబడి రావడం గమనార్హం. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
నెల ధరలు
(43 కేజీల బస్తా)
ఫిబ్రవరి రూ. 5000
మార్చి రూ.4100
ఏప్రిల్ రూ.3000
842
1234
5324
ఎకరాలు
ప్రస్తుతం మార్కెట్లో వేరుశనగ పంటకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మూడునెలల కిందట మార్కెట్లో ఒక బస్తా ధర రూ. 5 వేలకు పైగా పలికింది. పంట దిగుబడులు చేతికొచ్చాక ఇప్పుడు బస్తా రూ. 3 వేలే అంటున్నారు. మార్కెట్లో ధరలు ఇష్టానుసారంగా తగ్గించేయడం ఎంతవరకు సమంజసం. కాయకష్టం చేసి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధరల కల్పించాలి. – వెంకటస్వామి, గుర్రంకొండ.
నేను ఎకరం పొలంలో వేరుశనగ సాగు చేశాను. ప్రస్తుతం కోతలు, పంట నూర్పిడి పనులు పూర్తయ్యాయి. తీరా లెక్కిస్తే ఎకరానికి 20 బస్తాల లోపే దిగుబడి వచ్చింది. గత ఏడాది ఎకరం పంటకు సుమారు 40 బస్తాలు వచ్చాయి. ఈ సంవత్సరం దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. – నాగార్జున, తలారివాండ్లపల్లె
రూ.8.63
కోట్లు


