మదనపల్లె టౌన్ : బాధితులకు సత్వర న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. సోమవారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హాజరై ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అర్జీలు స్వీరించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం పిటిఎం మండలం మల్లెలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విశ్వనాథ్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4.5 లక్షలకు సైబర్ నేరగాళ్లు మోసం చేయడంతో తన బాధను ఎస్పీకి వివరించి న్యాయం చేయాలని కోరారు. ఇదే కాకుండా ఇంకా భూ వివాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, నకిలీ పత్రాలతో మోసాలు, అధిక వడ్డీలతో వేధించడం, ప్రేమ పేరుతో మోసాలు, మైనర్లను పెళ్లిళ్లు చేసుకోవడం వంటి ఇతరత్రా సమస్యలను ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే సంబంధిత ప్రాంత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యలపై ఆలస్యం చేయరాదని సూచించారు. చట్టపరమైన చర్యలు తీసుకున్న వెంటనే, ఆ వివరాలతో కూడిన నివేదికలను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి అందజేయాలని ఎస్పీ ఆదేశించారు.
ప్రయివేట్ సంస్థపై ఫిర్యాదు
మదనపల్లె పట్టణంలో ఉన్న టీవీఎఫ్ ప్రయివేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులపై బాధి తురాలు సోమవారం స్థానిక జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన అంజలీ టీవీఎఫ్ ప్రయివేట్ ఫైనాన్స్లో రూ.40 వేలు రుణంగా తీసుకుంది. ఆ అప్పును సకాలంలో చెల్లిస్తున్నా వడ్డీ అసలు ఇకే సారి కట్టాలని వేధిస్తుండడంతో బాధను తాళలేక బాధితురాలు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. తనను ఆదుకోవాలని కోరింది.
ఇళ్ల స్థలాలు లాకున్నారు..
పెద్దమండ్యం మండలం బండ్రేవుకు చెందిన బషీర్ బాషా తన ఇంటి స్థలం అదే ఊరికి చెందిన ఖాదర్ బాషా లాక్కొన్నాడని పీజీఆర్ఎస్లో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.


