లక్కిరెడ్డిపల్లి : అన్నమయ్య జిల్లా చౌటపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు (36) అనే వ్యక్తి శుక్రవారం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం గొల్లపల్లికి చెందిన గంగాదేవితో రామాంజులుకు వివాహమైంది. మూడు సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉండి తరువాత విడిపోవడంతో రామాంజులు మద్యానికి బానిసయ్యాడు. రాయచోటి–కడప జాతీయ రహదారి టోల్గేట్ వద్ద అంబులెన్సులో పని చేస్తూ జీవనం సాగించేవాడు. శుక్రవారం డ్యూటీ దిగాడు. మధ్యాహ్నం గుగ్గుళ్ల గుట్టవద్దకు వెళ్లి మద్యం తాగాడు. అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు. ప్రేమకుమార్ అనే వ్యక్తి వచ్చి నీ కుమారుడు అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లి 108లో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. ఎండవేడికి తట్టుకోలేక..నోరు ఆరిపోయి వడదెబ్బ వల్ల మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు లక్కిరెడ్డిపల్లి పోలీసులు తెలిపారు.


