సదుం : వృద్ధురాలి మెడలో గుర్తు తెలియని వ్యక్తి బంగారు చైన్ చోరీ చేసిన సంఘటన సదుం మండలంలో శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద రెడ్డెమ్మ నివసిస్తోంది. ఆమె మధ్యాహ్నం నిద్రిస్తుండగా ఎవరో తలుపు తట్టడంతో లేచి తీసింది. బురఖా ధరించిన వ్యక్తి మొహంపై కారం కొట్టి మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు చైన్ లాక్కొని వెళ్లాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు.
పాము కాటుతో మహిళకు అస్వస్థత
మదనపల్లె టౌన్ : పూలు కోస్తుండగా విష సర్పం కాటేసి మహిళ తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన శుక్రవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. బాధితురాలి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. పట్టణంలోని సిటిఎం రోడ్ ఎస్టేట్లో కాపురం ఉంటున్న ఆదెప్ప భార్య అంజమ్మ(36) తన ఇంటి సమీపంలో ఉన్న పూల చెట్టులో పూలు కోయడానికి వెళ్లింది. పూలు కోస్తుండగా చేతిపై ఏదో కరచినట్లు అయింది. రక్తం కారుతుండటంతో.. వెంటనే ఆమెను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి పాము కరిచిందని గుర్తించారు. ప్రథమ చికిత్సలు అందించి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.
వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
చాపాడు : మైదుకూరు –ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని చాపాడు మండలం నాగులపల్లె గ్రామ సమీపంలో ప్రొద్దుటూరు వైపు వెళ్లే దారిలో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నాగులపల్లె సమీపంలోని రైస్ మిల్లు ఎదురుగా ప్రొద్దుటూరు వైపు వెళుతున్న 50 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తిని వాహనం ఢీకొనగా.. అక్కడికక్కడే మృతి చెందినట్లు చాపాడు పోలీసులు తెలియజేశారు. మృతుడి ఒంటిపై తెల్లటి చొక్కా, ఎర్రటి లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వారు తెలియజేశారు. మృతుడి ఆచూకీ గుర్తించేందుకు వారు చర్యలు చేపట్టారు.
జమ్మలమడుగు : మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన పల్లా బాలుగ్రం అనే న్యాయవాది కనిపించడం లేదంటూ ఆయన భార్య సుదర్శనదేవి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 6వ తేదీ ఇంటి నుంచి వెళ్లి అతను తిరిగి రాలేదు. బంధువులను విచారణ చేసినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. సమగ్ర విచారణ చేపడుతున్నామని మైలవరం ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి తెలిపారు.


