కడప రూరల్: సూర్యుడు ‘చుర్రు’మంటున్నాడు.. మాడు పగిలేలా భగభగమంటున్నాడు. ఇటీవల కాలంలో వాతావ‘రణం’ రణరంగంగా మారింది. దీంతో ప్రజల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పటికే జిల్లాలో 42–43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్నరోజుల్లో 48 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావర ణ శాఖ అంచనా. ఈ నేపధ్యంలో వడదెబ్బ తగలకుండా..ఆరోగ్య జాగ్రత్తలు పాటించాడం శ్రేయస్కరం.
జాగ్రత్తలతోనే అడ్డుకట్ట...
ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీంతో మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం (హైపో ధలామన్) దెబ్బతింటుంది. ఫలితంగా సదరు వ్యక్తి వడదెబ్బకు గురవుతాడు. దీనినే ‘హీట్ స్ట్రోక్’ లేదా ‘సన్ స్ట్రోక్’ అంటారు. ఈ దశ ప్రమాదకరం, ప్రాణాంతకం.
లక్షణాలు..కారణాలు..
● చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం
● వణుకు పుట్టడం. మగత నిద్ర లేదా కలవరింత.
● ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి కలగడం.
● శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం. శరీరం ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది.
శరీరంలో కలిగే మార్పులు...
● వేడి వలన చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోతుంది. లేదా శరీరంలోని నీటి నిష్పత్తి తగ్గితుంది.
● ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు 3–4 లీటర్ల నీటిని చెమట రూపంలో శరీరం కోల్పోతుంది.
అధికంగా అనారోగ్యానికి గురయ్యేవారు ..
● 65 ఏళ్ల వయస్సు పై బడిన వారు.
● గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు
● అనారోగ్యంతో బాధపడుతున్న వారు
ఎండ ఎరుపు రంగు పూసుకుంది..
ఉదయం ఏడింటికే సుర్రుమంటోంది. సాయంత్రం చీకటిపడేదాకా తాపం ఆగనంటోంది. ఇంకేముంది భానుడి సెగ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. మండుటెండల కారణంగా వడ‘దెబ్బ’ పొంచి ఉంది. ఇప్పటికే చాలాచోట్ల వడదెబ్బలు నమోదవుతున్నాయి.. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అనూహ్యంగా మారిన వాతావరణం
ఇప్పటికే 42–43 గరిష్ట ఉష్ణోగ్రతలు..
పొంచిఉన్న వడ‘దెబ్బ’..ఆరోగ్యంపై పెను ప్రభావం


