పెద్దమండ్యం: వాటర్గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న సంప్ పనులను మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి గురువారం పరిశీలించారు. మండలంలోని కలిచెర్ల పంచాయతీ పోలేరమ్మ గుడికి సమీపంలో వాటర్గ్రిడ్ సంప్ పనులను ఇటీవల చేపట్టారు. అక్కడ జరుగుతున్న పనులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. గండికోట రిజర్వాయర్ నుంచి తాగునీటిని అందించేందుకు 2,370 కోట్లతో పనులు చేపడుతున్నట్లు సబ్ కలెక్టర్కు అధికారులు వివరించారు. సంప్ నిర్మాణం, సామర్థ్యం గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఎన్వోపల్లె గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు వాట్సప్ గవర్నెన్స్ ద్వారానే సేవలను అందించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అక్కడున్న సిబ్బందిని శాఖల వారీగా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది ఫేషియల్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. తహసీల్దార్ తేజస్వి, ఎంపీడీఓ శ్రీధర్రావు, ఆర్డబ్ల్యుఎస్ డీఈ చంద్రశేఖరరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజునాయక్, విఆర్వో ఆంజినేయులు నాయక్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ కలిశారు. గురువారం విజయవాడ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసి జిల్లాలోని వివిధ అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు.


