ములకలచెరువు: ఉపాధిహామీ పథకంలోని ప్రతి కూలీకి పని కల్పించాలని డ్వామా పీడీ వెంకటరత్నం సిబ్బందికి ఆదేసించారు. బుధవారం ఆయన సిబ్బందితో కలిసి పాతములకలచెరువులోని ఫీడర్ చానల్ వర్క్ను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. జాబ్కార్డు కలిగిన ప్రతిఒక్కరూ పనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సీఎల్ఆర్సీ భవనంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఉపాధిహామీ సిబ్బందితో పనులపై సమీక్షించారు. ములకలచెరువు క్లస్టర్ పరిధిలోని ఆరు మండలాల్లో 10895 మంది కూలీలు పనులకు హాజరుకావాల్సివుండగా 3963 మంది మాత్రమే హాజరవుతున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. 100 శాతం కూలీలు పనులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, 26 రకాల పనులు కులీలకు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ చందన, ఏపీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
డ్వామా పీడీ వెంకటరత్నం


