పుంగనూరు : పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పంపిణీలో నిరక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నపిల్లల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు వెంకటపద్మలత, గాంధీబాబు హెచ్చరించారు. శనివారం డీఈవో సుబ్రమణ్యం, డొక్కాసీతమ్మ మధ్యాహ్నభోజనం అడిషినల్ డైరెక్టర్ రవికుమార్తో కలసి సభ్యులు పలు పాఠశాలలను సందర్శించారు. గత వారం నగరివీధిలోని యూపీస్కూల్లో భోజనంలో బల్లిరావడం, విద్యార్థులు అస్వస్థతకు గురికావడం విధితమే. దీనిపై సభ్యులు, అధికారులు విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పరిశీలించారు. అలాగే నక్కబండలో గల కస్తూర్బా పాఠశాల, అడవినాథునికుంటలోని మోడల్స్కూల్ను పరిశీలించారు. బాలికల హాస్టల్ను సందర్శించారు. వెంకటపద్మలత మాట్లాడుతూ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీపడరాదన్నారు. ఈ విషయాలపై నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండ చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నటరాజారెడ్డి, తహసీల్దార్ రాము పాల్గొన్నారు.


