రాయచోటి: రోడ్డుపై నిలిపి ఉన్న పాలవ్యానును ఢీకొని బత్తల శ్రీనివాసులు (25) అక్కడికక్కడే మృతి చెందాడు. రాయచోటి పట్టణ పరిధిలోని చిత్తూరు రోడ్డులో ఉన్న ఎస్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కడప పట్టణం అలంకాన్పల్లికి చెందిన బత్తల చంద్రయ్య కుమారుడు శ్రీనివాసులు రాయచోటిలోని పీటీఎంపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. శుక్రవారం బంధువుల ఇంటి నుంచి బైకుపై బయలుదేరిన శ్రీనివాసులు చిత్తూరు మార్గంవైపు వెళ్తుండగా పాల విక్రయానికి నిలిపి ఉన్న వ్యాన్ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఆటో డ్రైవర్కు తీవ్రగాయాలు
మదనపల్లె టౌన్: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. బి.కొత్తకోటకు చెందిన జి. వెంకటరమణ(60) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తన ఆటో మరమ్మతుకు గురి కావడంతో రిపేరీ కోసం స్పేర్ పార్ట్స్ తీసుకుని రావడానికి మదనపల్లెకు ద్విచక్ర వాహనంలో వచ్చాడు. స్థానిక సిటిఎం రోడ్డులోని ఓ ఆటో స్పేర్ పార్ట్స్ అంగడి వద్దకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతున్న ఆటో డ్రైవర్ ను ఓ స్కూటరిస్టు వేగంగా వచ్చి ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందించారు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డిజైన్ కట్టర్ మీదపడి
కార్పెంటర్కు తీవ్రగాయాలు
మదనపల్లె టౌన్: డిజైన్ కట్టర్ మీదపడి కార్పెంటర్ తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు .. పట్టణంలోని బుగ్గ కాలువకు చెందిన చోటు (34) కార్పెంటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో స్థానికంగా ఉన్న ఓ కార్పెంటర్ షాప్లో కొయ్యలకు కట్టర్తో డిజైన్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు కట్టర్ పొట్టపై పడి పొట్ట చీలిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని సహచరులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు.


