పీలేరురూరల్ : ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అదనపు డైరెక్టర్ డాక్టర్ కె. అనిల్కుమార్ అన్నారు. సోమవారం పీలేరు వంద పడకల ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోని బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రిలోని వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయొద్దని సూచించారు. వ్యర్థాల నిర్వహణలో అన్నమయ్య జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, వాల్మీకిపురం, పీలేరు ఆస్పత్రులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు వైద్య బృందా లు తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఉత్తమ ఫలితాలు సాధించిన ఆస్పత్రులకు పారిశుద్ధ్య ఎంపికతోనే ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. ఆస్పత్రులకు కూడా రాష్ట్ర స్థాయిలో కాయకల్ప అవార్డులతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, జిల్లా క్వాలిటీ మేనేజర్లు ప్రభావతి, నాగరాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నాగవేణి, డాక్టర్ చంద్రశేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


