కురబలకోట: ‘రెండు గ్రామాలకు ఒక తాగునీటి బోరు వేసి తమాషా చూస్తున్నారా..పైగా ఏళ్లుగా పక్కా రోడ్డు కూడా లేదు..నీళ్లు సరిపడా రావడం లేదు..ఆఫీసుల్లో కూర్చుని ఏం చేస్తున్నారని’ మండలంలోని ఎర్రజేనువారిపల్లి గ్రామస్థులు నిలదీశారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘రెండు గ్రామాల మధ్య తాగునీటి గొడవ..శత్రువులుగా మారిన బంధువులు..పరస్పర దాడులు..నెలకొన్న ఉద్రిక్తత అనే వార్త కథనం సోమవారం ప్రముఖంగా ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో సోమవారం ఆ గ్రామానికి వివిధ శాఖల అధికారులు వెళ్లారు. ఇంటికి ఒక బోరు వేసుకుంటున్న నేటి రోజుల్లో ఒక తాగునీటి బోరు వేసి రెండు గ్రామాల వారు నీళ్లు తాగమనడం ఎంతవరకు న్యాయమని గ్రామస్థులు నిలదీశారు. రెండు గ్రామాలకు ఒక బోరు వేసి అదీ నీటి సరఫరా బాధ్యత ఒక గ్రామానికి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. నీటి సరఫరాలో ఎర్రజేనువారిపల్లికి తొలి నుంచి అన్యాయం జరుగుతోందని విమర్సించారు. పక్కా రోడ్డు గురించి కూడా ఎందుకు పట్టించుకోరని మండిపడ్డారు. తమ ఊరికే ప్రత్యేకంగా బోరు వేసి తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. దీంతో ఎంపీడీఓ గంగయ్య స్పందిస్తూ సత్వరం కొత్త బోరు వేసి నీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. అదే విధంగా పక్కా రోడ్డుకూడా వేయడం జరుగుతుందని తెలిపారు.


