కలికిరి : ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ అనీల్కుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిఘా వుంచి ఆదివారం మధ్యాహ్నం మండల పరిధిలోని మేడికుర్తి క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. తమిళనాడు వాసులు ఒక ద్విచక్రవాహనంలో ముగ్గురు రావడంతో వారిని ఆపడంతో తడబడిన వాళ్లు పొంతన లేని సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తరలించడానికి ఎర్రచందనం దుంగలు సిద్ధంగా ఉన్నాయని, ముందుగా దారి చూస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో మేడికుర్తి క్రాస్ సమీపాన నల్లగుట్ట వద్ద దాచిన నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. అలాగే ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు వేలూరు జిల్లా అన్నిగట్టు తాలూకా తొంగమలైకి చెందిన సోదరులు చంద్రన్, రామరాజు, సెంగాడకు చెందిన దొరస్వామిగా గుర్తించారు. వీరు ఎర్రచందనం కూలీలుగా విచారణలో తేలిందని సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ.6.65 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ రమణ, హెడ్కానిస్టేబుల్లు రాజేంద్రప్రసాద్, మహమ్మద్ రఫీ, పీసీలు విజయ్కుమార్, ఆర్.యల్లరాజ, బాబేషావల్లి, రమణయ్య, దినేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


