మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలోని ఎర్రజేండ్లలో తాగునీటి పైప్లైన్ ధ్వంసం చేసిన వారిని నిలదీయడంతో.. వారు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. శనివారం జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీ ఎర్రజేండ్ల ఒక మారుమూల కుగ్రామం. గ్రామానికి దారి కూడా సరిగా లేని పల్లె. నాలుగు కుటుంబాల వారే అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే పక్కనే ఉన్న అడివిగుంతల గ్రామానికి చెందిన శివప్ప, హరి, నాని, విష్ణు మరికొందరు ఎర్రజేండ్ల పల్లె ప్రజలతో తరచూ గొడవలు పడుతున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఎర్రజేండ్లకు ఉన్న తాగు నీటి పైపు లైన్లను ధ్వంసం చేశారు. ఈ విషయమై స్థానిక సెక్రటరీ, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఎర్రజేండ్ల గ్రామస్తుల తాగు నీటి సమస్యపై పట్టించుకోలేదని ఆరోపిస్తూ పైపు లు ధ్వంసం చేసిన శివప్ప వర్గీయులను శనివారం నిలదీశారు. ఆగ్రహంతో రెచ్చిపోయిన శివప్ప తన అనుచరులతో మూకుమ్మడిగా వచ్చి ఎర్రజేండ్లకు చెందిన గోవిందు, నారాయణ, నాగమణి, అలివేలుపై కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్సల నిమిత్తం కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ముదివేడు పోలీసులు దాడి ఘటనపై విచారణ చేస్తున్నారు.
నిలదీసిన గ్రామస్తులపై మూకుమ్మడి దాడి


