మదనపల్లె టౌన్ : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దమండ్యం మండలం సిద్దవరానికి చెందిన శ్రీకాంత్(27) గురువారం ద్విచక్ర వాహనంలో పెద్దమండ్యంకు బయలుదేరాడు. సిద్దవరం మలుపు వద్దకు వెళ్లాగానే ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపు తప్పి శ్రీకాంత్ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబీకులు చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు.
స్కూటర్ ఢీకొని..
జాతరలో పూసలు అమ్ముకోవడానికి వచ్చిన ఓ వృద్ధురాలిని స్కూటర్ ఢీకొని తీవ్రంగా గాయపడింది. పుంగనూరు మండలం పాళ్యంపల్లికి చెందిన జయన్న భార్య రాజేశ్వరి (65) పూసలు, చిన్న పిల్లల ఆట వస్తువులు పల్లెలకు తిగి అమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో జరగనున్న చౌడేశ్వరీ అమ్మవారి ఉత్సవాలలో పూసలు, చిన్న పిల్లల ఆట వస్తువులు అమ్ముకోవడానికి వచ్చింది. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుందామని చౌడేశ్వరీదేవి గుడి సమీపంలో రోడ్డు దాటుతున్న రాజేశ్వరిని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లి పోయాడు. ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం వృద్ధురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతికి రెఫర్ చేశారు. రెండవ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


