కలకడ : పిడుగుపడి నాలుగు పాడిఆవులు మృతి చెందిన సంఘటన మండలంలోని నవాబుపేట పంచాయతీ చావిడికాడపల్లెలో జరిగింది. వెటర్నిటి అసిస్టెంట్ డైరెక్టర్ క్రిష్ణయ్య తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి కలకడ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చావిడికాడపల్లెలో పి.వెంకటేశు కుమారుడు పి.వెంకటమణనాయుడు (అప్పయ్యచౌదరి) పాడి ఆవులను కట్టిన వసారుపై పిడుగు పడింది. ఈ సంఘటనలో నాలుగు పాడి ఆవులు మృతి చెందాయి. కేవలం పాడి ఆవులే ఆధారంగా జీవిస్తున్న పాడి రైతుకు తీవ్ర నష్టం చేకూరింది. జాతీయ ప్రమాద విపత్తుల కింద నివేదికలు పంపనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ క్రిష్ణయ్య, పశువైద్యాధికారి డాక్టర్ తేజకళ్యాణ్ లుతెలిపారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు అప్పయ్య చౌదరి కుటుంబ సభ్యులు కోరారు.
రథోత్సవానికి రంగులు
దిద్దుకుంటున్న రథం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జరగబోవు రథోత్సవానికి ఒంటిమిట్ట రామయ్య రథం నూతన రంగులతో మెరుగులు దిద్దుకుంటుంది. టీటీడీ సివిల్ విభాగం అధికారులు రథోత్సవానికి ఒంటిమిట్ట రథాన్ని పూర్తి స్థాయిలో దృఢంగా ఉండేలా సిద్ధం చేస్తున్నారు. ఈ పనుల నాణ్యతలో గుత్తేదారుడు కట్టా సుబ్బరాయుడు రాజీ పడకుంగా శరవేగంగా పూర్తి చేసే పనుల్లో నిమగ్నం అయ్యారు. రథోత్సవానికి ముందే ఒంటిమిట్ట రథాన్ని అన్ని విధాలా సిద్ధం చేసి ఉంచాలని టీటీడీ సివిల్ విభాగం అధికారులు గుత్తేదారుడిని ఆదేశించారు.


