పీడీ వెంకటరత్నం
పీలేరు : ఉపాధి హామీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పీడీ వెంకటరత్నం అన్నారు. బుధవారం పీలేరు పట్టణంలో ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 8.5 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ. 3.85 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. పీఆర్ ఏఈ, ఉపాధి ఏపీవో పనులు పర్యవేక్షించి నాణ్యతలో రాజీలేకుండా పనిచేయాలన్నారు. ఎంపీడీఓ శివశంకర్, ఏపీవో అశోక్రెడ్డి, పీఆర్ ఏఈ రామకృష్ణ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డునిర్మాణ పనుల పరిశీలన
కేవీపల్లె : ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పీడీ వెంకటరత్నం అన్నారు. బుధవారం మండలంలోని గర్నిమిట్టలో ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 11.50 లక్షలతో 290 మీటర్ల పొడవు సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీవో సుధాకర్, ఏపీవో నాగరాజ తదితరులు పాల్గొన్నారు.


