మదనపల్లె సిటీ: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు, తల్లిదండ్రుల కోలాహలంతో పరీక్ష కేంద్రాలు సందడిగా మారాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9 గంటలకే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మొత్తం 124 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్ 21,614 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 21.464 మంది హాజరయ్యారు. 150 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కేంద్రాల వద్ద తాగునీటితో పాటు వైద బృందం ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంకు అనుమతించారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తొలి రోజు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లోని వసతులు, పరీక్షల తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.


