గుర్రంకొండ : ఏటిగడ్డ గంగమ్మతల్లి విగ్రహాన్ని కొంతమంది దుండగులు కూలదోయడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటన మండలంలోని శెట్టివారిపల్లెలో జరిగింది. గ్రామంలో తరతరాలుగా దళితులు ఏటిగడ్డ గంగమ్మతల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలొ గత ఆదివారం దళితులు ఏటిగడ్డ గంగమ్మతల్లికి జాతర చేశారు. అదేరోజు రాత్రి కొంతమంది దుండగులు అమ్మవారికి అలంకరించిన పూజ సామగ్రిని తొలగించారు. అంతేకాక విగ్రహాన్ని పెకలించి అక్కడే పడేశారు. విషయం తెలుసుకొన్న దళితులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తిత నెలకొంది. జాతర నిర్వహించిన రోజు కావాలనే అమ్మవారి విగ్రహాన్ని కూలదోసి గ్రామంలొ మత ఘర్షణలను సృష్టించడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని దళితులు పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై సోమవారం మదనపల్లె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ, స్థానిక పోలీస్స్టేషన్లొనూ ఫిర్యాదులు చేసినట్లు వారు తెలిపారు. ఈ విషయయమై ఎస్ఐ రవీంద్రబాబును వివరణ కోరగా శెట్టివారిపల్లెలో సంఘటనా స్థలానికి వెళ్లామన్నారు. ఈ విషయం గురించి స్థానిక తహసీల్దార్కు సమాచారం అందించామన్నారు. సదరు స్థలాన్ని సర్వేచేసి తగిన చర్యలు చేపడతామని ఎస్ఐ పేర్కొన్నారు.


