మదనపల్లె టౌన్ : కరెంటు షాక్ కొట్టి ఉత్తరప్రదేశ్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులను స్థానిక నీరుగట్టువారిపల్లెకు చెందిన రాము ఇటీవల కూలీ పనులు చేయించుకోవడానికి తీసుకు వచ్చాడు. తక్కువ కూలీలతో రాత్రి వేళల్లో.. కొత్తగా నిర్మించే ఇళ్లకు పీఓపీ పనులు చేయించేవాడు. ఈ క్రమంలో నీరుగట్టువారిపల్లె సమీపంలోని రింగు రోడ్డు వద్ద ఓ భవనానికి పీఓపీ పనులు చేస్తుండగా తస్లీం(19)కరెంటు షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని సహచరులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, ప్రథమ చికిత్స అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని అనంతరం వారు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. స్థానిక టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో ఓ యువకుడు వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఘటనపై ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బి.కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన విజయ్(26) కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న వాస్మోల్ పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, ప్రథమ చికిత్సలు అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సలహాపై వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


