మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన
సిద్దవటం : మహాశివరాత్రి ఉత్సవాలలో శ్రీ నిత్యపూజ స్వామిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలు నిలుపుదల చేసే పార్కింగ్ ప్రదేశాలను ఏఎస్పీ మనోజ్కుమార్హెగ్డే మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 14, 15, 16వ తేదీలలో 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వాహనాలు నిలుపుదల చేసేందుకు ఆరు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించామని తెలిపారు. పంచలింగాల గుడి వద్ద పోలీస్ కంట్రోల్ పాయింట్ను ఏర్పాటు చేసి కాలినడకన వెళ్లే మార్గంలో కొన్ని ప్రదేశాలలో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా తగు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేసే వద్ద భక్తులు దిగేటప్పుడు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలిపారు. స్వామి సన్నిధానంలో భక్తులు క్యూలైన్లో వచ్చి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలని, వృద్ధులు, వికలాంగులకు సూచించిన ప్రదేశాలలో వెళ్లాలని తెలిపారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాలతో ఆయనకు ఘనంగా సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, ఎస్ఐ మహమ్మద్రఫీ, డిప్యూటీ రేంజర్ ఓబులేసు, ఆలయ చైర్మన్ జంగిటి రాజేంద్రప్రసాద్, ఎండోమెంట్ సిబ్బంది చంద్ర, ఫారెస్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.


