బ్యాంకుల సమ్మెతో స్తంభించిన సేవలు
జిల్లాలో 180 బ్యాంకుల్లో సాగిన సమ్మె
రాయచోటి: వారానికి ఐదు రోజులే పని దినాలుగా ప్రకటించాలని.. మిగిలిన రెండు రోజులు సెలవుగా ప్రకటించాలంటూ ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేశారు. ఈనెల 23న చీఫ్ లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకే మొగ్గు చూపుతున్నట్లు బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ సమ్మెకు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం అన్నమయ్య జిల్లాలో 180 బ్యాంకులలో ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 180 బ్యాంకు సేవలకు అంతరాయం నెలకొంది. సమ్మె కారణంగా మరో మూడురోజులు బ్రాంచులు మూతపడనున్నాయన్న సమాచారం వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఆదివారం సెలవు, సోమవారం గణతంత్ర దినోత్సవంతో రెండురోజులపాటు బ్యాంకులు మూతపడిన విషయం తెలిసిందే. సమ్మె కారణంగా వరుసగా మూడోరోజు కూడా బ్యాంకు సేవలు అందుబాటులో లేవు. సమ్మె ప్రభావంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్, చెక్కు క్లియరెన్స్ వంటి సేవలు స్తంభించాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది.


