మదనపల్లెకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం
మదనపల్లె రూరల్ : ప్రజల ఆకాంక్ష ప్రకారం అన్నమయ్య జిల్లాను మదనపల్లె జిల్లాగా ప్రకటించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్కుమార్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లె జిల్లా ప్రకటించాలని కోరుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సీఎం చంద్రబాబునాయుడు, ఇటు మదనపల్లెకు, అటు రాజంపేటకు అన్యాయం చేశారని, ఎన్నికల సందర్భంగా చేసిన హామీని తుంగలో తొక్కారని విమరిర్శంచారు. మదనపల్లె ప్రజలకు మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, కేవలం జిల్లా కేంద్రంగా చేశారన్నారు. రేపు ప్రభుత్వం మారితే, మదనపల్లె జిల్లా కేంద్రం వేరొకచోటకు తరలించే ప్రమాదం ఉందన్నారు. మదనపల్లెకు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని, ప్రజలంతా మదనపల్లె జిల్లా కావాలని కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బాలాజీ, శ్రీనాథ్, ప్రశాంత్, మహేష్, లక్ష్మీపతి, అనిల్, సంధ్య, కన్న, శశి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మురళీ, పట్టణ కార్యదర్శి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.


