మదనపల్లె పేరుతో జిల్లా ప్రకటించాలి
మదనపల్లె రూరల్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం మదనపల్లె కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించి, అన్నమయ్య జిల్లాగా మార్చడం బాగోలేదని, మదనపల్లె పేరుతోనే జిల్లా ప్రకటించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్కుమార్, సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళీ, కాంగ్రెస్పార్టీ నాయకుడు రెడ్డిసాహెబ్ డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె పేరుతోనే జిల్లా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వేర్వేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన మదనపల్లె పేరును జిల్లాకు పెట్టాలనేది, స్థానిక ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంగా పరిగణించాలన్నారు. మదనపల్లెకు ఎంతో ఘనచరిత్ర ఉందని, ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జన్మస్థలం, బీటీ కళాశాల వేదికగా అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించారని, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన జాతీయ గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి ఇక్కడే అనువదించారని, అతిపెద్ద టమాటా మార్కెట్, శానిటోరియం క్షయనివారణ కేంద్రం, ఆంధ్రా ఊటీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రత్యేకతలు, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం మదనపల్లె అన్నారు. ఇలాంటి విశిష్టత కలిగిన ప్రాంతానికి ఏమాత్రం సంబంధం లేని అన్నమయ్యపేరును పెట్టడం సమంజసం కాదన్నారు. అన్నమయ్యపై కూటమిప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాజంపేటను అన్నమయ్యజిల్లా కేంద్రంగా కొనసాగించి, మదనపల్లె జిల్లాను వేరు చేయాలే తప్ప ఆయన పేరును కొత్త జిల్లాకు పెట్టడం భావ్యం కాదన్నారు.


